హైదరాబాద్: ఇటీవల నగరంలో కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన వరద బాధితులకు ప్రభుత్వం రూ.400 కోట్లు విడుదల చేసిందని, 3,00,000 కుటుంబాలకు రూ.300 కోట్లను పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు మంత్రి కేటీఆర్. బుధవారం మున్సిపల్,వాటర్ బోర్డ్, విద్యుత్, మూసి రివర్ ఫ్రంట్,మెట్రో రైల్ అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో 1572 ప్రాంతాలు వర్షాల వల్ల తీవ్రంగా ప్రభావితం అయ్యాయని, 230 కాలనీలు,బస్తీలు పూర్తిగా నీట మునిగాయన్నారు. వర్షాల కారణంగా భారీ ఎత్తున వ్యర్థాలు రావడం తో ప్రతి రోజు 10000 మెట్రిక్ టన్నుల చెత్తను తొలిగిస్తున్నామని చెప్పారు. నగరం లో యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు.
దెబ్బ తిన్న చెరువులను రూ.41 కోట్ల తో మరమ్మత్తులు చేసేందుకు నిర్ణయించామని, మూసీ నది వ్యర్థాలను తొలిగించేందుకు 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రేటర్ శివారు ప్రాంతల్లో 15 మున్సిపాలిటీల్లో 300 కాలనీలు బాగా దెబ్బతిన్నాయని, అక్కడ సహాయక చర్యలు చేపట్టామన్నారు. 37,000 డ్రై రేషన్ కిట్ల ను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వర్షాల వల్ల నష్ట పోయి, పరిహారం లభించని వారు,ఆధారాలతో GHMC అధికారులను సంప్రదించాలన్నారు.