తెరవెనుక ఎవరు?: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో అప్పటి సీఎస్ శాంతికుమారి ఏం చెప్పారంటే.. ?

తెరవెనుక ఎవరు?: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో అప్పటి సీఎస్ శాంతికుమారి ఏం చెప్పారంటే.. ?
  • ప్యానెల్ ను ఎస్ఐబీ తప్పుదోవ పట్టించిందన్న అప్పటి సీఎస్ శాంతికుమారి 
  • వాళ్లు పంపిన నంబర్లపై అభ్యంతరం వ్యక్తం చేశామని సిట్ కు వెల్లడి
  • ప్యానెల్ కమిటీ ఆదేశాలనూ అధికారులు పట్టించుకోలేదా?
  • ఆ వింగ్ చీఫ్ ప్రభాకర్ రావు ఎవరి కనుసన్నల్లో పనిచేసినట్టు!!
  • కాంగ్రెస్ లీడర్ల పేర్లను మావోయిస్టులుగా చూపుతూ ప్యానెల్ ముందుకు?
  • ఎన్నికల వేళ కామారెడ్డిలోనూ ఫోన్ ట్యాపింగ్  పాయింట్  
  • రేవంత్ సోదరుడు అద్దెకున్న ఇంటి యజమాని ఫోన్ కూడా..!
  • జీఏడీ చీఫ్ రఘునందన్ రావు స్టేట్మెంట్  నూ రికార్డ్ చేసిన పోలీసులు

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు అప్పటి సీఎస్ శాంతి  కుమారి. ఫోన్ ట్యాపింగ్ చేసిన ఎస్ఐబీ.. రివ్యూ ప్యానెల్ నూ తప్పుదోవ పట్టించిందని స్టేట్ మెంట్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ఎస్ పంపిన నంబర్లను రివ్యూ చేసి అభ్యంతరం తెలిపినట్టు ఆమె వెల్లడించారు. అయినా యథేచ్ఛగా ట్యాపింగ్ జరిగింది. ఇంతకూ ఎస్ఐబీ ఎవరి కంట్రోల్ లో పనిచేసింది..? ఆ విభాగానికి బాస్ ఎవరు..? అన్నది హాట్ టాపిక్ గా మారింది. గతంలో విచారణ సందర్భంగా మాజీ డీఎస్పీలు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్ మెంట్లను సిట్ తీసుకుంది. వారిచ్చిన నేరాంగీకరపత్రంలో అప్పటి బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు చెప్పారు. 

ఈ కేసులో ఏ1గా ఉన్న ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు మాత్రం అప్పటి డీజీపీ, ప్యానల్ ఆదేశాలతోనే ట్యాపింగ్ చేసిట్టు చెప్పారు. ప్రతి విషయం ప్యానల్ ముందుంచామని, ఆ మేరకు ట్యాపింగ్ జరిగిందని పేర్కొన్నారు. దీంతో సిట్ ఇవాళ  ప్యానల్ లో సభ్యురాలిగా ఉన్న శాంతి కుమారిని విచారణకు పిలిచింది. ఆమె నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నది. గతంలో అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునంద్ రావు స్టేట్ మెంట్ ను సిట్ ఇదివరకే తీసుకున్నది. అందరూ తమనకు ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు తప్పుదోవ పట్టించారని చెప్పారు. 

దీంతో సిట్ ఏం చేయబోతోంది..?   అనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాకర్ రావు స్పష్టంగా వివరాలు చెప్పకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు  సిద్ధమవుతోంది. తమకు విచారణకు సహకరించడం లేదని తెలుపుతూ పిటిషన్ వేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేసి.. కస్టడీలోకి తీసుకునేందుకు సిట్  ఏర్పాట్లు చేసుకుంటోందని సమాచారం. ఇందులో భాగంగానే ముందుగా ఫోన్ ట్యాపింగ్ బాధితుల నుంచి స్టేట్ మెంట్లు రికార్డు చేస్తోందని తెలుస్తోంది.

కామారెడ్డిలోనూ ఫోన్ ట్యాపింగ్

అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత రెడ్డి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కామారెడ్డి  నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి కామారెడ్డిలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ప్రచారం చేశారు. ఈ క్రమంలో కొండల్ రెడ్డి ఫోన్ తో పాటు ఆ ఇంటి యజమాని ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తోంది. 

గులాబీ బాస్ కు నోటీసులిస్తారా?

ఈ కేసులో ఏ1 మినహా మిగతా నిందితులంతా బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినందున కేసీఆర్ ను కూడా విచారణకు  పిలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఒక వేళ ఆయన రాని పక్షంలో ఫాంహౌస్ కు వెళ్లి స్టేట్ మెంట్ తీసుకునే అవకాశం ఉందని సమాచారం.