న్యూఢిల్లీ: మన దేశానికి చెందిన గొప్ప మాజీ ప్లేయర్లను కోచ్లుగా మార్చుకునేందుకు లాక్డౌన్ రూపంలో మంచి అవకాశం దొరికిందని బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ పీవీ సింధు చెప్పింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) ఇటీవల నియమించిన అసోసియేట్ డైరెక్టర్లు మంగళవారం నిర్వహించిన ఆన్లైన్ సెషన్లో సింధు మాట్లాడింది. ‘కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల్లో ఫారిన్ కోచ్లు ఇండియాకు రావడం చాలా కష్టం. ఇంటర్నేషనల్ లెవెల్లో సత్తా చాటిన ఎందరో మాజీ ప్లేయర్లు మనకున్నారు. వారందరినీ కోచ్లుగా ఉపయోగించుకునేందుకు ఇదో మంచి అవకాశం’ అని సింధు చెప్పింది. అంతేకాక అథ్లెట్ల తల్లిదండ్రులు, కోచ్లను సమన్వయం చేసుకుంటూ సాయ్ అధికారులు పని చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయని సింధు సూచించింది. ‘ అధికారులు ప్రతీ అథ్లెట్ జర్నీని తెలుసుకుని తీరాలి. సాయ్ రీజనల్ సెంటర్లలో పర్యటించి ప్రతీ అథ్లెట్ పెర్ఫామెన్స్పై అవగాహనకు రావాలి. అథ్లెట్ల తల్లిదండ్రులతో టచ్లో ఉండాలి. వారి ఫీడ్బ్యాక్ను ఎప్పటికప్పుడు తీసుకోవాలి.
అన్నింటికంటే మించి అథ్లెట్పై నిరంతర పర్యవేక్షణ ఉండడం వల్ల ఏజ్ ఫ్రాడ్కు చాన్స్ ఉండదు’ అని సూచించింది. చాలా సందర్భాల్లో అథ్లెట్ల తల్లిదండ్రులు చేసిన త్యాగాలకు తగిన గుర్తింపు లభించదని సింధు ఆవేదన వ్యక్తం చేసింది. 2016 రియో ఒలింపిక్స్లో సింధు సిల్వర్ మెడల్ గెలిచింది. ఈ జర్నీలో తన పేరెంట్స్ పాత్ర చాలా ఉందని ఆమె చెప్పింది. ‘ రియో ఒలింపిక్స్కు ముందు మేం అకాడమీకి షిఫ్ట్ అయ్యాం. నన్ను జాగ్రత్తగా చూసుకోవడం కోసం అమ్మ తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. నాన్న తన జాబ్కు రెండేళ్లు లీవ్ పెట్టి నాకు అండగా నిలిచారు. 2015లో అయిన గాయం నుంచి నేను కోలుకునేందుకు వాళ్లిద్దరూ చాలా సాయపడ్డారు. ఆ టైమ్లో అకాడమీలో కూర్చొని ఆడేదాన్ని. ఒలింపిక్స్కు క్వాలిఫై కావాలంటే 23 టోర్నీలు ఆడాల్సి ఉంది. నాన్న సెలవులో ఉండడంతో ప్రతిరోజు నన్ను రైల్వే గ్రౌండ్కు తీసుకెళ్లేవారు. అదే నాకు ప్లస్ అయ్యింది’ అని సింధు చెప్పుకొచ్చింది. ఖేలో ఇండియా లాంటి పథకాల ద్వారా ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని సింధు పేర్కొంది.