- మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: ముఖ్యమంత్రి కేసీఆర్ కు అధికారం మీద ఉన్న ఆసక్తి ప్రజా సమస్యల మీద లేదని మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన నిధులుగా చూపిస్తోందని ఆయన ఆరోపించారు. రేగొండ మండలం రుపిరెడ్డి పల్లి గ్రామంలో ప్రజాగోస...బీజేపీ భరోసా బైక్ ర్యాలీని ముఖ్య అతిధిగా హాజరైన బాబు మోహన్ ప్రారంభించారు. బీజేపీ సీనియర్ నేత చందుపట్ల రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి బాబు మోహన్ మాట్లాడుతూ కేంద్ర ఇస్తున్న నిదులను రాష్ట్ర ప్రభుత్వం తన నిధులుగా చూపెడుతోందన్నారు. అంతేకాదు కేంద్రం చేపట్టిన పథకాల పేరు మార్చి కొత్త పథకాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. మోడీ ఆదేశాలతో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని బాబుమోహన్ ధీమా వ్యక్తం చేశారు.