
కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణ కీలక దశకు చేరింది. ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. సోమవారం (జూన్ 9) ఉదయం తెలంగాణ భవన్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు సమక్షంలో బీఆర్కే భవన్ చేరుకున్నారు. బీఆర్కే భవన్ లో జస్టిస్ ఘోష్ కమిషన్ ఆయనను విచారించనుంది.
కమిషన్ విచారణకు హరీష్ రావు హాజరవుతున్న తరుణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్కే భవన్ ముందు బలగాలను మోహరించారు. ఎటువంటి అనూహ్య ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకున్నారు.
కమిషన్ విచారణకు ఇప్పటికే ఆయన అన్నివిధాలా సిద్ధమయ్యారు. ఈ అంశంపై మూణ్నాలుగు దఫాలుగా కేసీఆర్ తో చర్చలు జరిపారు. ఇంజినీర్ల నుంచి వివరాలు ఆరా తీశారు. కీలక డాక్యమెంట్లను సిద్ధం చేసుకుని విచారణకు బయల్దేరారు.
ఈ కేసులో అంతకు ముందు శుక్రవారం (జూన్ 6) ఈటల రాజేందర్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈటల చెప్పిన సమాధానలపై హరీష్ రావును ప్రశ్నించే అవకాశం ఉంది. ఈనెల 11న మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరుకావాల్సి ఉంది.