లోక్ సభ ఎన్నికల తర్వాత.. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్: ఎంపీ లక్ష్మణ్

లోక్ సభ ఎన్నికల తర్వాత.. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్: ఎంపీ లక్ష్మణ్
  • తెలంగాణలో బీజేపీ సర్కారు దిశగా పరిస్థితులు మారతయ్: ఎంపీ లక్ష్మణ్
  • బీఆర్ఎస్ ఖాళీ.. కాంగ్రెస్ ఖతం అవుతయ్
  • బీఆర్ఎస్ ను బీబీబీ (బాబా, బేటా, బేబీ)గా మార్చుకోవాలె: చుగ్    
  • బీజేపీలో చేరిన పలువురు బీఆర్ఎస్ మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు 

న్యూఢిల్లీ, వెలుగు: లోక్​సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్​కు మార్గం సుగమం అవుతుందని బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సభ్యుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఆ దిశగా రాజకీయ పరిస్థితులు మారతాయన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాళీ, కాంగ్రెస్ ఖతం అయ్యి.. బీజేపీ హవా మొదలవుతుందని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి పెరుగుతున్న చేరికలే అందుకు నిదర్శనమన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కుటుంబ పార్టీలని.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని కాంగ్రెస్, కేటీఆర్ ను సీఎం చేయాలని బీఆర్ఎస్ పని చేస్తున్నాయన్నారు. 

ఆదివారం ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసులో ఆ పార్టీలోకి బీఆర్ఎస్ మాజీ ఎంపీలు గొడెం నగేశ్, సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావ్, కాంగ్రెస్ నేత గోమసే శ్రీనివాస్ చేరారు. పార్టీ రాష్ట్ర ఇన్​చార్జి తరుణ్ చుగ్, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం చుగ్ మాట్లాడుతూ.. దేశంలో వారసత్వ, అవినీతి రాజకీయ పార్టీల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ తన బీఆర్ఎస్ పార్టీ పేరును బీబీబీ (బాబా, బేటా, బేబీ)గా మార్చుకుంటే సరిపోయేదని ఎద్దేవా చేశారు. అవినీతి పాలనను సహించలేకే ఆ పార్టీకి ప్రజలు ఓటుతో సమాధానం చెప్పారన్నారు. 

మోదీ లీడర్ షిప్ నచ్చి పార్టీలో చేరాం..  

గిరిజనుల అభివృద్ధి కోసం మోదీ ప్రణాళికలు బాగున్నాయని మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర అభివృద్ధిలోనూ తాను ముందు ఉంటానన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. మోదీ పదేండ్ల పాలనను చూసి బీజేపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నానని మాజీ ఎంపీ నగేశ్ అన్నారు. యువతకు ఉపాధి దొరకాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్ రావు అన్నారు. అందుకే తాను బీజేపీలో చేరినట్లు చెప్పారు. 2014 ఎన్నికల్లో ఖమ్మంలో బీఆర్ఎస్ నుంచి గెలిచింది తానొక్కడినే అని అన్నారు. మోదీ ప్రపంచ నాయకుడిగా ఎదిగారని, ఆయన ఆధ్వర్యంలోని బీజేపీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పని చేస్తానని సైది రెడ్డి అన్నారు. తాను బీజేపీలోకి రావడాన్ని పార్టీ నల్గొండ జిల్లా నేతలు వ్యతిరేకిస్తున్నారన్న అంశం తన దృష్టికి రాలేదన్నారు. జిల్లా, రాష్ట్ర నాయకత్వంతో కలిసి పని చేస్తానన్నారు. 

నేడు బీజేపీ సెకండ్ లిస్ట్ పై కసరత్తు

లోక్ సభ ఎన్నికలకు సెకండ్ లిస్ట్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులో భాగంగా సోమవారం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) భేటీ కానుంది. ఈ భేటీలో తెలంగాణలో మిగిలిన 8 స్థానాలపై చర్చించనునట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ  8 స్థానాల్లో.. తాజాగా పార్టీలో చేరిన ఐదుగురికీ అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇందులో జలగం వెంకట్ రావుకు ఖమ్మం, జి.నగేశ్​కు ఆదిలాబాద్, సీతారాం నాయక్​కు మహబూబాబాద్, సైదిరెడ్డికి నల్గొండ, గోమసే శ్రీనివాస్​కు పెద్దపల్లి స్థానాలు దక్కవచ్చని చెబుతున్నారు. మహబూబ్ నగర్ స్థానంపై కూడా క్లారిటీ రావచ్చని అంటున్నారు. వరంగల్, మెదక్ సీట్ల నుంచి ఆరూరి రమేశ్, అంజిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. సీటు ఆశించి పార్టీలో చేరినప్పటికీ.. అభ్యర్థుల ఎంపికపై పార్టీ సీఈసీ నిర్ణయమే ఫైనల్ అవుతుందని పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు.

చేరికల్లోనే అవమానం.. 

బీజేపీలో చేరిన నేతలకు అవమానం జరిగింది. మొత్తం ఐదుగురు నేతలు పార్టీలో చేరగా, వారిలో మాజీ ఎంపీ సీతారాంనాయక్​కు మాత్రమే స్టేజీపై మాట్లాడే అవకాశం ఇచ్చారు. మిగతా నలుగురికీ అక్కడ మాట్లాడే చాన్స్ ఇవ్వలేదు. లక్ష్మణ్, చుగ్, సీతారాంనాయక్ మాట్లాడిన తర్వాత జాయినింగ్ ప్రొగ్రాంను ముగించారు. సాధారణంగా పార్టీలో మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల ముఖ్యనేతలు చేరితే.. జాయినింగ్ అనంతరం మాట్లాడేందుకు అవకాశం ఇస్తారు. కానీ తమకు అవకాశం ఇవ్వకపోవడంతో ఈ నలుగురు నేతలు హాల్ బయట పోడియం వద్ద మీడియాతో మాట్లాడాల్సి వచ్చింది. పార్టీలో జాయిన్ అయినప్పుడే అవమానం పాలు కావడంపై ఆ నేతలు కొంత కలత చెందారు.