హుజూరాబాద్‌ బైపోల్స్: లక్ష మెజార్టీయే బీజేపీ లక్ష్యం

హుజూరాబాద్‌ బైపోల్స్: లక్ష మెజార్టీయే బీజేపీ లక్ష్యం

హుజూరాబాద్: సీఎం కేసీఆర్ ఇప్పటికే వంద తప్పులు చేశారని, మరో తప్పు చేస్తే శిశుపాల వధ తప్పదని మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి హెచ్చరించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ ఇన్‌చార్జ్‌ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జితేందర్ రెడ్డి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. రావణాసురుడి లాంటి కేసీఆర్‌ దండు మీద పోరాటం సాగించాల్సిందేనని, హుజూరాబాద్‌లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

‘మంత్రులకు కూడా అపాయింట్‌‌మెంట్ ఇవ్వనిదే లోపలకు రావొద్దనే దరిద్రమైన పార్టీ టీఆర్ఎస్. అలాంటి దరిద్రమైన పార్టీ నుంచి గొప్ప పార్టీ అయిన బీజేపీలోకి ఈటల రాజేందర్ వచ్చారు. ఈటల కాషాయ కండువా వేసున్నందుకు మాకు గర్వంగా ఉంది. ఈటలకు జరిగిన మోసాన్ని కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి వివరించాలి. ఇంత బలగం మనకుండగా.. వాళ్లు డబ్బులెలా పంచుతారో చూద్దాం. మన కార్యకర్తలను ఒక్కరిని అరెస్టు చేస్తే వెయ్యి మంది అండగా ఉండి అరెస్టులకు సిద్ధం కావాలి. టీఆర్ఎస్‌‌లో గుంటనక్కలుంటే మా దగ్గర సింహాల్లాంటి నేతలున్నారు. హుజురాబాద్‌‌లో ఈటల కోసం పోరాటం చేస్తున్నాం. ప్రజల ఆత్మగౌరవ కోసం చేస్తున్న పోరు ఇది. ఈ ఎన్నికలో గెలవడం కాదు.. లక్ష మెజార్టీ సాధనే మన ధ్యేయం. నీతివంతమైన ఈటలకు అన్యాయం జరిగింది. బీజేపీ నాయకులు, గతంలో టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లంతా పాలు, నీళ్లలా కలసి పనిచేయాలి’ అని జితేందర్ రెడ్డి సూచించారు.