టెహ్రాన్: ఇరాన్ నయా సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మరణ పుకార్లకు ఇరాన్ తెరదించింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ మీడియా మొజ్తబా ఖమేనీ వీడియోను విడుదల చేసింది. ఒక నిమిషం 19 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో మొజ్తబా ఖమేనీ కొంతమంది విద్యార్థులకు అరబిక్లో మత శాస్త్రాన్ని బోధిస్తూ కనిపించారు. దీంతో మొజ్తబా ఖమేనీ చనిపోయారన్న డెత్ రూమర్లు చెక్ పడింది.
2026, ఫిబ్రవరి 28న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా మిస్సైల్ దాడులు చేశాయి. ఈ దాడిలో అయతొల్లి ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కొందరు చనిపోయారు. ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఎన్నికయ్యాడు.
కానీ మొజ్తాబా ఖమేనీ బయట ఎక్కడ కనిపించకపోవడంతో ఇజ్రాయెల్, ఇరాన్ దాడుల్లో ఈయన కూడా చనిపోయారని ఊహాగానాలు వినిపించాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో తీవ్రంగా గాయపడి మొజ్తబా ఖమేనీ కోమాలోకి వెళ్లాడని, అతడిని రహస్యంగా రష్యా తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారని మరికొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
అమెరికా, ఇజ్రాయెల్ కూడా మొజ్తబా బతికే ఉన్నారో లేదో తమకు ఖచ్చితంగా తెలియదనడంతో ఆయన ఆచూకీపై గందరగోళం నెలకొంది. అసలు ఆయన బతికే ఉన్నారా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మొజ్తబా ఖమేనీకి సంబంధించిన వీడియోను ఇరాన్ విడుదల చేసి సుప్రీం లీడర్ డెత్ రూమర్లకు ఎండ్ కార్డ్ వేసింది. అయితే, ఇరాన్ విడుదల చేసిన వీడియో పాతదని.. ఇప్పటి వీడియో కాదని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి.
🚨 Published for the first time
— IRIB (Islamic Republic of Iran Broadcasting) (@iribnews_irib) March 19, 2026
A video of religious science teaching by Ayatollah Mojtaba Khamenei pic.twitter.com/uFtIvZ0POy
