- తక్షణమే భూదాన్ యజ్ఞ బోర్డు ఏర్పాటు చేయాలి
అబిడ్స్, వెలుగు: భూమి లేని నిరుపేదలకు చెందాల్సిన భూదాన్భూములను రక్షించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా ఆరోపించారు. శుక్రవారం నాంపల్లి గాంధీ భవన్ తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర సర్వసభ్య సమావేశం మండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.శంకర్ నాయక్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూదాన్భూములను గుర్తించి తెలంగాణ భూదాన్యజ్ఞ బోర్డును ఏర్పాటు చేసి, భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని డిమాండ్చేశారు. శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ఆక్రమణకు గురైన భూదాన్భూములను తిరిగి స్వాధీనం చేసుకొని వాటిని ప్రభుత్వ వెబ్ సైట్ లో పెట్టాలని కోరారు. అనంతరం సంగారెడ్డి జిల్లాకు చెందిన చందా శ్రీనివాస్ ను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నారు. మండలి కార్యదర్శి గిరిప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఖాదర్ బేగ్, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు యాదమ్మ, యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి మహేశ్, నాయకులు పాల్గొన్నారు.
