కాళేశ్వరం నీరు కేసీఆర్ ఫామ్ హౌజ్ కు తరలిస్తున్రు

కాళేశ్వరం నీరు కేసీఆర్ ఫామ్ హౌజ్ కు తరలిస్తున్రు

సీఎం కేసీఆర్ అబద్దాల కోరు అని..ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేదని  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిదేండ్లు అవుతున్నా నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎవరికి ఉద్యోగం రాకున్నా..కేసీఆర్ కుటుంబానికి  ఉద్యోగాలు వచ్చాయన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్ట్ కు రూ. లక్ష కోట్లు ఖర్చు చేసినా ఆశించిన స్థాయిలో ప్రయోజనం లేదన్నారు.  కాళేశ్వరం నీటిని కేసీఆర్ ఫామ్ హౌజ్ కు సరఫరా చేసుకుంటున్నారని మండిపడ్డారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా టీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. 

జయశంకర్ భూపాల పల్లి జిల్లా రంగపురంలో జరిగిన  ప్రజా గోస -బీజేపీ భరోసా కార్యక్రమంలో  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ ఇంచార్జీ కీర్తి రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నుంచి కార్యకర్తలు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వివేక్ వెంకటస్వామి. ఆ తర్వాత అంకుషాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ కూలీలతో కాసేపు మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన బీజేపీ నేతలు పాల్గొన్నారు.