
హైదరాబాద్: తెలంగాణలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ SIT ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయనను కీలక సూత్రధారిగా SIT భావిస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో ఎస్ఐబీ చీఫ్గా పనిచేసిన సమయంలో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.
ప్రభాకర్ రావు విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ బృందం భావిస్తోంది. గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ట్యాపింగ్ జరిగిందనే అంశంపై, అలాగే ఎంతమంది రాజకీయ, సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశారనే కోణంలో సిట్ ఆయనను విచారించనుంది. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేసిన వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ప్రభాకర్ రావుపై ఆరోపణలున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి దుబాయ్ మీదుగా ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ప్రభాకర్ రావుపై ఇప్పటికే లుక్ ఔట్ సర్క్యులర్ అమల్లో ఉండటంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన వద్ద ఉన్న సుప్రీం కోర్టు ఆర్డర్, వన్ టైం ఎంట్రీకి అనుబంధమైన ఎమర్జెన్సీ సర్టిఫికెట్ సహా ఇతర డాక్యుమెంట్లను పరిశీలించారు.
ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి సమాచారం ఇచ్చారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్లోని సిట్ ఆఫీస్కు చేరుకున్నారు. వెస్ట్జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి సహా ఐదుగురు సభ్యుల బృందం ప్రభాకర్ రావును విచారిస్తుంది. సిట్ విచారణలో ఆయన ఏం చెప్తారనేది ఆసక్తికరంగా మారింది.