హైదరాబాద్: తెలంగాణ మాజీ డీజీపీ శివధర్ రెడ్డికి కీలక పదవి దక్కింది. రాష్ట్ర భద్రతా సలహాదారుగా తెలంగాణ ప్రభుత్వం ఆయనను నియమించింది. ప్రభుత్వం ఈ మేరకు గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు 3 సంవత్సరాల పాటు ప్రభుత్వం ఈ బాధ్యతలు అప్పగించింది. పోలీస్ వ్యవస్థపై ప్రభుత్వానికి సలహాలు, శాంతి భద్రతల పర్యవేక్షణలో భద్రతా సలహాదారుగా మాజీ డీజీపీ శివధర్ రెడ్డి కీలక పాత్ర పోషించనున్నారు.
అంతర్గత భద్రతపై మార్గనిర్దేశం చేయనున్నారు. నేర నియంత్రణపై సూచనలు, నార్కోటిక్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఆయనకు ప్రభుత్వం సీఎస్ స్థాయి హోదా కల్పించింది. ప్రత్యేక కార్యాలయం, సిబ్బందిని కేటాయించింది. రిటైర్మెంట్ తర్వాత శివధర్ రెడ్డికి ఈ కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం రావడం విశేషం. డీజీపీ శివధర్ రెడ్డి పదవీ కాలం ఏప్రిల్ 30తో ముగిసిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర పోలీస్ బాస్గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ (1991 బ్యాచ్) నియమితులైన సంగతి తెలిసిందే. యూపీఎస్సీ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సీఎస్ కే.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే మే 1న సీవీ ఆనంద్ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారుల్లో సీవీ ఆనంద్ అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి డీజీపీలు నియమితులైన అందరూ తొలుత ఇంచార్జి డీజీపీగాలు బాధ్యతలు నిర్వహించగా.. సీవీఆనంద్ మాత్రం పూర్తిస్థాయి డీజీపీగా నియమితులు కావడం గమనార్హం. డీజీపీగా 2028 జూన్ వరకు సీవీ ఆనంద్ కొనసాగనున్నారు.

