మంచంపై శవంగా మాజీ మంత్రి.. కారు, ఫోన్ మిస్సింగ్

మంచంపై శవంగా మాజీ మంత్రి.. కారు, ఫోన్ మిస్సింగ్

యూపీ: ఉత్తరప్రదేశ్‎లో మాజీ మంత్రి ఆత్మారాం తోమర్ అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. బిజ్రాల్ గ్రామానికి చెందిన తోమర్ నగరంలోని బిజ్రాల్ రోడ్డులోని ఓ ఇంట్లో నివసిస్తున్నాడు. అయితే శుక్రవారం ఉదయం తోమర్ డ్రైవర్ విజయ్ కాలింగ్ బెల్ ఎంతసేపు కొట్టినా ఎటువంటి స్పందన లేదు. దాంతో డ్రైవర్.. పనిమనుషుల సాయంతో తలుపులు పగులుగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. తోమర్ మంచంపై విగతజీవిగా పడిఉన్నాడు. వెంటనే విజయ్.. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. తోమర్ మెడకు బిగుసుకున్న టవల్‎ను గుర్తించారు. పోలీసులు ప్రాథమిక విచారణ ప్రకారం.. తోమర్‎ను గొంతు నులిమి చంపినట్లు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఒక్కడే ఉన్నాడని పోలీసులు తెలిపారు. కాగా.. పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తోమర్ ఇంట్లోకి రావడం.. ఆ తర్వాత కాసేపటికి ఆయన స్కార్పియో కారు నడుపుకుంటూ వెళ్లడం గుర్తించారు. అదేవిధంగా తోమర్ ఫోన్ కూడా మిస్సైనట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో తోమర్ ఇంట్లోకి వచ్చింది ఎవరా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఆత్మారాం 1993 అసెంబ్లీ ఎన్నికల్లో బాగ్‌పత్ జిల్లాలోని ఛప్రౌలి నుంచి బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 1997లో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.