ఖైరతాబాద్/గచ్చిబౌలి/ఘట్కేసర్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్లపై పెట్టిన కేసులను విత్ డ్రా చేసుకోవాలని కొంతమంది తమను బెదిరిస్తున్నారని ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, పైలెట్ రోహిత్ రెడ్డి, రేగ కాంతారావు పేర్కొన్నారు.
ఫోన్ చేసి, మెసేజ్లు పెట్టి బెదిరిస్తున్నారంటూ కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బంజారా హిల్స్లో, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గచ్చిబౌలిలో, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి రాయదుర్గంలో, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లలో శనివారం వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 26 నుంచి కొంతమంది ఫోన్ చేసి కేసు విత్డ్రా చేసుకోవాలని, లేదంటే అంతు చూస్తామని బెదిరిస్తున్నారని హర్షవర్ధన్రెడ్డి తెలిపారు.