న్యూఢిల్లీ : ఇండియాలో సబ్మెరైన్లను నిర్మించే ‘పీ75ఐ’ ప్రాజెక్టు నుంచి ఫ్రాన్స్కు చెందిన నేవల్ గ్రూప్ తప్పుకుంది. దేశీయంగా 6 సంప్రదాయ సబ్మెరైన్లను తయారు చేయాల్సి ఉండగా.. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (ఏఐపీ) సిస్టమ్కు సంబంధించిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)లో పెట్టిన కండిషన్ల మూలంగా ఈ ప్రాజెక్టులో కొనసాగలేమని చెప్పింది. ప్రధాని మోడీ బుధవారం ఫ్రాన్స్లో పర్యటించాల్సి ఉండగా.. ఒక్కరోజు ముందుగా నేవల్ గ్రూప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. మంగళవారం నేవల్ గ్రూప్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ లారెంట్ విడీయు ఓ ప్రకటన రిలీజ్ చేశారు.‘‘ఆర్ఎఫ్పీలోని కొన్ని షరతుల కారణంగా.. ఇద్దరు వ్యూహాత్మక భాగస్వాములు మాకు, కొన్ని ఇతర విదేశీ పరికరాల తయారీదారులు(ఎఫ్ఓఈఎం)లకు ప్రతిపాదనలను అందజేయలేకపోయారు. అందువల్ల మేం అధికారిక బిడ్ వేయలేకపోయాం’’ అని అందులో పేర్కొన్నారు. సంప్రదాయ సబ్మెరైన్లు హై స్పీడ్లో కూడా నీటి లోపల ఎక్కువ సమయం ఉండేలా ఏఐపీ సిస్టమ్ చేయగలదు. ఈ విషయంలోనూ లారెంట్ కామెంట్ చేశారు.‘‘ఇంధన సెల్ ఏఐపీ.. సముద్రంలో నిరూపితమవ్వాలి. ఇది ఆర్ఎఫ్పీకి కావాలి. కానీ ఫ్రెంచ్ నేవీ అలాంటి ప్రొపల్షన్ సిస్టమ్ను ఉపయోగించదు. అందువల్ల ఇది మాకు సంబంధించినది కాదు” అని లారెంట్ చెప్పారు.
రూ.43 వేల కోట్ల కాంట్రాక్ట్
కిందటేడాది జూన్లో ‘పీ75ఐ’ ప్రాజెక్టుకు రక్షణ శాఖ అనుమతిచ్చింది. ఎంపిక చేసిన 2 ఇండియన్ కంపెనీ(వ్యూహాత్మక భాగస్వాములు)లకు ఆర్ఎఫ్పీలను జారీ చేసింది. ఒకటి ఎల్&టీ, రెండోది మజగావ్ డాక్స్ లిమిటెడ్. షార్ట్లిస్ట్ చేసిన ఫారిన్ కంపెనీలు థిస్సెన్క్రుప్ మెరైన్ సిస్టమ్స్(జర్మనీ), నేవన్షియా(స్పెయిన్), నేవల్ గ్రూప్ (ఫ్రాన్స్), దాయ్వూ (సౌత్కొరియా), రోసోబోరోన్ ఎక్స్పోర్ట్(రష్యా)లలో ఒకదానితో ఒప్పందం చేసుకుని, ఆర్ఎఫ్పీపై స్పందన తెలియజేయాలని చెప్పింది. రెండు దేశీ సంస్థల నుంచి వచ్చిన స్పందనలను పరిశీలించిన తర్వాత రక్షణ శాఖ రూ.43 వేల కోట్ల కాంట్రాక్ట్ను అందజేయాల్సి ఉంది. ఐదు సంస్థల్లో నేవల్ గ్రూప్ను ఎంపిక చేయగా.. ఇప్పుడు అది తప్పుకుంది.