వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ తాను ఒక 'హీరో'నని మరోసారి నిరూపించుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కాకినాడ జిల్లాలో జరిగిన బాణసంచా ప్రమాదం ఒక నిరుపేద కుటుంబంలో తీరని చీకటిని నింపింది. ఇప్పుడు ఆ కుటుంబానికి వెలుగురేఖలా నిలిచారు బన్నీ. తన తండ్రిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఒక మానసిక దివ్యాంగురాలికి జీవితాంతం అండగా ఉంటానని భరోసా ఇచ్చి, అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
ఆ రోజు ఏం జరిగింది?
గత నెల 28న కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని ఒక బాణసంచా తయారీ కేంద్రంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో కడింపల్లి దుర్గ తండ్రి సత్యనారాయణ ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబానికి ఆయనే ఏకైక ఆధారము. ఆయన మరణంతో మానసిక దివ్యాంగురాలైన దుర్గ అనాథగా మిగిలిపోయింది. కనీసం తన అవసరాలను కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్న ఆమె దీనగాథ సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. ఈ వార్త అల్లు అర్జున్ దృష్టికి వెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించారు.
జీవితాంతం గౌరవంగా బతికేలా..
దుర్గ పరిస్థితిని తెలుసుకున్న అల్లు అర్జున్, కేవలం ఒక్కసారి సాయం చేసి వదిలేయకుండా, ఆమె జీవితాంతం గౌరవంగా బతికేలా ఏర్పాటు చేశారు. ఆమె పోషణ నిమిత్తం ప్రతి నెల రూ. 7,500 చొప్పున ఆమె బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తామని ప్రకటించారు. అల్లు అర్జున్ ఆదేశాల మేరకు, ప్రముఖ నిర్మాత బన్నీ వాసు పర్యవేక్షణలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు నేరుగా వేట్లపాలెంలోని దుర్గ నివాసానికి వెళ్లారు. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి, ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తక్షణ ఖర్చుల కోసం కొంత నగదును అందజేయడమే కాకుండా, భవిష్యత్తులోనూ ఏ అవసరం వచ్చినా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండగా ఉంటారని హామీ ఇచ్చారు.
రియల్ హీరో అల్లు అర్జున్
సాధారణంగా సెలబ్రిటీలు విరాళాలు ఇచ్చి వార్తల్లో నిలుస్తుంటారు. కానీ, ఒక అపరిచిత దివ్యాంగురాలి జీవిత బాధ్యతను భుజానికెత్తుకోవడం అల్లు అర్జున్ సంస్కారానికి నిదర్శనం అంటున్నారు ఫ్యాన్స్. గతంలోనూ కేరళ వరదలు, కరోనా సమయం,ఎందరో పేద విద్యార్థుల చదువులకు సాయం చేసిన బన్నీ, ఇప్పుడు దుర్గ విషయంలో చూపిన చొరవ స్థానికులను, అభిమానులను గర్వపడేలా చేస్తోందని ప్రశంసిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి చేసే చిన్న సాయం.. ఒక జీవితాన్నే నిలబెడుతుంది అనే మాటను అల్లు అర్జున్ అక్షరాలా నిజం చేశారని కొనియాడుతున్నారు.
మరోసారి మానవత్వం చాటిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
— PulseNewsBreaking (@pulsenewsbreak) March 10, 2026
కాకినాడలో ఇటీవల ఒక టపాసుల ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో తన తండ్రిని కోల్పోయిన కడింపల్లి దుర్గకు అల్లు అర్జున్ ఆర్థిక సహాయం
జీవితాంతం ఆమె బ్యాంక్ ఖాతాలో ప్రతి నెల రూ.7,500 డిపాజిట్ చేస్తానని అల్లు అర్జున్ ప్రకటన.. యువతిని… pic.twitter.com/bJNOdqvZBY
