
కోల్కతా: తన జీవితంలో రాజకీయాలకు తావు లేదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. కాకపోతే ఇండియా టీమ్కు కోచ్గా పని చేసే చాన్స్ వస్తే తప్పకుండా స్వీకరిస్తానన్నాడు. ‘క్రికెట్లో నేను వేర్వేరు పాత్రలో పని చేశాను. కాబట్టి రాజకీయాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. రాజకీయాల్లోకి వచ్చే చాన్స్ లేదు. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసే ఆసక్తి లేదు. ఒకవేళ సీఎం పదవి ఇచ్చినా నాకు వద్దనే చెబుతాను. 2013లో రిటైర్మెంట్ తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్ను అయ్యా. టీమిండియా కోచ్గా పని చేసే చాన్స్ వస్తే కచ్చితంగా తీసుకుంటా’ అని దాదా పేర్కొన్నాడు. ఇక టెస్ట్లకు గుడ్బై చెప్పిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. 2027 వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవడం అంత సులభం కాదన్నాడు. అప్పటి వరకు ఫిట్గా ఉండటం చాలా కష్టమని చెప్పాడు.
‘రిటైర్మెంట్ తర్వాత అందరిలాగే ఆట వాళ్ల నుంచి దూరమైపోతుంది. వాళ్లు కూడా ఆట నుంచి దూరమవుతారు. దీన్ని మనం గమనించాలి’ అని సౌరవ్ తెలిపాడు. వన్డే వరల్డ్ కప్ వరకు కోహ్లీకి 38, రోహిత్ 40 ఏళ్లకు చేరుకుంటారు. అప్పటి వరకు టీమిండియా 9 ద్వైపాక్షిక సిరీస్ల్లో కలిపి 27 వన్డేలు ఆడాల్సి ఉంటుంది. అంటే కోహ్లీ, రోహిత్ ఏడాదికి 15 వన్డేలు ఆడాల్సి ఉంటుంది. అయితే ఇది సాధ్యం కాకపోవచ్చని గంగూలీ వెల్లడించాడు. ‘వన్డే వరల్డ్ కప్లో ఆడేందుకు అవసరమైన సలహాలు నా దగ్గర లేవు. వాళ్లు ఎలా ఆడతారో వాళ్లకు బాగా తెలుసు. ఈ విషయంలో వాళ్లే నిర్ణయం తీసుకుంటారు. ఇద్దరు లెజెండ్స్ రిటైర్మెంట్ తర్వాత కొంత శూన్యత ఏర్పడింది. అయితే కోహ్లీలాంటి నైపుణ్యం ఉన్న ప్లేయర్ను భర్తీ చేయడం చాలా కష్టం. కొద్దిగా టైమ్ పడుతుంది’ అని సౌరవ్ వ్యాఖ్యానించాడు.