డిసెంబర్ 28 నుంచి గ్రామ సభలు..తెలంగాణలో సోనియా పోటీ.!

డిసెంబర్ 28 నుంచి గ్రామ సభలు..తెలంగాణలో సోనియా పోటీ.!
  • గ్యారంటీలు, స్కీమ్​ల కోసం అక్కడే ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ
  • కాంగ్రెస్​ పీఏసీ సమావేశంలో నిర్ణయం
  • అర్హులకే పథకాలు అందేలా చర్యలు
  • గ్రామస్థాయిలోనే అప్లికేషన్ల వడబోత
  • గత ప్రభుత్వ అక్రమాలను 
  • ప్రజలకు తెలియజెప్పేలా కార్యాచరణ
  • శాఖల వారీగా వైట్​ పేపర్ల రిలీజ్​కు ఏర్పాట్లు..

హైదరాబాద్​, వెలుగు: ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్​ పార్టీ యాక్షన్​ ప్లాన్​ సిద్ధం చేసింది. వంద రోజుల్లో గ్యారంటీలను అమలు చేయడంతో పాటు ఇతర హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు గ్రామాల్లోనే ప్రజల నుంచి అప్లికేషన్లను తీసుకోనుంది. ఇందుకోసం గ్రామ సభలను నిర్వహించనుంది. కాంగ్రెస్​ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్​ 28 నుంచే ఈ కార్యక్రమాన్ని షురూ చేయనుంది. సోమవారం గాంధీభవన్​లో కాంగ్రెస్​ పార్టీ పొలిటికల్​ అఫైర్స్​ కమిటీ (పీఏసీ) సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్​ రావ్​  ఠాక్రే, సీఎం, పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి నేతృత్వంలో 3 గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ నెల 28 నుంచి గ్రామసభలు నిర్వహించి, వివిధ పథకాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుని, అక్కడే వారి నుంచి అప్లికేషన్లు స్వీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. రూ.500కే సిలిండర్, మహిళలకు రూ.2,500 సాయం, చేయూత స్కీమ్, గృహజ్యోతి కింద ఫ్రీ కరెంట్​, రేషన్​ కార్డులు, గృహలక్ష్మి తదితర పథకాలపై గ్రామ సభల్లో జనానికి అవగాహన కల్పించి.. దరఖాస్తులను తీసుకోనున్నారు. 

ఇట్ల గ్రామస్థాయిలోనే అర్హులను గుర్తించి పథకాలను అమలు చేయాలని నిర్ణయించారు. ఎవరైనా అనర్హులు అప్లై చేసుకుంటే అక్కడికక్కడే ఆ దరఖాస్తులను తిరస్కరించి.. అర్హులైన వారికి మాత్రమే లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో గ్రామస్థాయిలోనే వడబోతకు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్​ పార్టీ నిర్ణయానికి వచ్చింది. సమావేశంలో మంత్రులు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​మహేశ్​కుమార్​ గౌడ్​, ప్రచార కమిటీ చైర్మన్​ మధుయాష్కీ,  నేతలు హర్కర వేణుగోపాల్, అంజన్​ కుమార్​ యాదవ్​, కుసుమ కుమార్​ తదితరులు పాల్గొన్నారు. 

గత ప్రభుత్వ అక్రమాలపై శాఖల వారీగా శ్వేతపత్రాలు

గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో జరిగిన అన్ని అక్రమాలపై శ్వేత పత్రాలు విడుదల చేయాలని కాంగ్రెస్​ పార్టీ పీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతిపైనే కాకుండా.. మిషన్​ భగీరథ, మిషన్​ కాకతీయ, ధరణి సహా అన్నిట్లో విచారణ చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ప్రతీకార చర్యల్లా కాకుండా, ఉన్న వాస్తవాలను వెలికితీసి ప్రజలకు తెలియజెప్పేలా ఈ కార్యాచరణను సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. శాఖల వారీగా ఆయా శాఖల మంత్రులు శ్వేత పత్రాలు విడుదల చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్ర ఆర్థిక, విద్యుత్​ శాఖల పరిస్థితులు, దుస్థితిపై భట్టి విక్రమార్క.. ఇరిగేషన్​, సివిల్​ సప్లైస్​పై ఉత్తమ్​ కుమార్​ రెడ్డి.. ఇట్లా మంత్రులు తమతమ శాఖలకు సంబంధించి వైట్​ పేపర్లను  అసెంబ్లీలో రిలీజ్​ చేసేలా పీఏసీ భేటీలో సూచనలు వచ్చినట్లు సమాచారం. అంతేగాకుండా జిల్లాలకు మంత్రులను ఇన్​చార్జులుగా చేసే వ్యవస్థను తిరిగి తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. కాగా, కాంగ్రెస్​ పార్టీ  ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి నాగ్​పూర్​లో నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఆ సభకు రాష్ట్రం నుంచి 50 వేల మందిని తీసుకెళ్లేలా పీఏసీ భేటీలో నిర్ణయించారు. ఆ సభ కో ఆర్డినేషన్​కు రాష్ట్రం నుంచి పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​కు బాధ్యతలు అప్పగించారు. 

లోక్​సభ ఎన్నికలపై దృష్టి పెట్టాలి: ఠాక్రే

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారని పీఏసీ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్​రావ్​  ఠాక్రే అన్నారు. పార్టీ విధానాలు, హామీలను ప్రజలు నమ్మారని, పార్టీకి మంచి విజయాన్నందించారని చెప్పారు. వచ్చే లోక్​సభ ఎన్నికలపై దృష్టి పెట్టాల్సిందిగా నేతలకు ఆయన సూచించారు. వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా కష్టపడాలన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో కనబరిచిన స్ఫూర్తి, పనితనాన్నే లోక్​సభ ఎన్నికల్లోనూ చూపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్​ మధు యాష్కీ అన్నారు. ప్రజల నమ్మకాలను నిలబెట్టుకోవాలని సూచించారు. 

అర్హులందరికీ సంక్షేమ పథకాలు: సీఎం రేవంత్​ 

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలని పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. అర్హులకు పథకాలు అందేలా చూడటంలో  పార్టీ నేతలు కూడా కృషి చేయాలని ఆయన సూచించినట్లు తెలిసింది. కేవలం ఎమ్మెల్యేలే కాకుండా.. పార్టీ నుంచి బీఫాంలు తీసుకున్న అభ్యర్థులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని సక్సెస్​ చేయాలని ఆయన చెప్పినట్లు సమాచారం. అభివృద్ధి, సంక్షేమ పథకాల బాధ్యత  జిల్లా ఇన్​చార్జ్​ మంత్రులదేనని స్పష్టం చేసినట్టు తెలిసింది. గ్రామసభల్లోనే అర్హుల ఎంపిక జరగాలని ఆయన తేల్చిచెప్పినట్టు సమాచారం. 

రాష్ట్రం నుంచి ఎంపీగా సోనియా పోటీ!

పీఏసీ సమావేశంలో మూడు తీర్మానాలను కాంగ్రెస్​ నేతలు పాస్​ చేశారు. కాంగ్రెస్​కు ఓటేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ మొదటి తీర్మానం చేయగా.. ఎన్నికల్లో భాగంగా రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేసి పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన సోనియాగాంధీ, రాహుల్​గాంధీ,  ప్రియాంక గాంధీ, ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు నేతలకు ధన్యవాదాలు తెలుపుతూ రెండో తీర్మానం చేశారు. సోనియా గాంధీని తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయాలని కోరుతూ మూడో తీర్మానం చేశారు. అందులో భాగంగా రెండు లేఖలను హైకమాండ్​కు రాశారు. తెలంగాణ నుంచి లోక్​సభకు పోటీ చేయాలని కోరుతూ సోనియా గాంధీకి ఒక లేఖ రాయగా.. రాష్ట్రం నుంచి ఒక స్థానాన్ని సోనియాకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గేకు మరో లేఖ రాశారు. అయితే, ఏ స్థానం నుంచి అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్​నగర్​, మెదక్​ లోక్​సభ స్థానాల్లో ఏదో ఒక చోటు నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.