- కరెంట్ బండ్లకు గిరాకీ
- ఈవీల వైపు మొగ్గుతున్న జనం
- రూ.10కే 100 కిలోమీటర్లు ప్రయాణించే వీలు
- మూడేళ్లలో 4,800 ఈవీల అమ్మకం
- హైబ్రిడ్ ఈవీలతో కలిపి 11 వేల వెహికల్స్
- హైదరాబాద్లోనే తయారీ ప్లాంట్లు
హైదరాబాద్, వెలుగు: కరెంట్ బండ్లకు (ఎలక్ట్రిక్ వెహికల్– ఈవీ) డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది ఈవీల వైపుకు మొగ్గుతున్నారు. ఖర్చు, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుండడంతో వాటినే కొంటున్నారు. మూడేళ్ల కిందట రాష్ట్రంలో కేవలం 16 ఈవీలే ఉండగా.. ఇప్పుడవి 4,800కు చేరాయి. జనాలు కరెంట్ బండ్లపై ఎంత ఆసక్తి చూపిస్తున్నారో ఈ లెక్కలే చెప్తున్నాయి. వాటితో పాటు పెట్రోల్, డీజిల్తో నడిచే హైబ్రిడ్ ఈవీలూ బాగానే అమ్ముడవుతున్నాయి. ఇప్పటిదాకా ఈవీ, హైబ్రిడ్ ఈవీలు కలిపి 11 వేల దాకా రిజిస్టర్ అయ్యాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే అయ్యే ఖర్చు కేవలం 10 రూపాయలే కావడం, ఆ ఖర్చుతోనే ఎక్కువ దూరం వెళ్లే వెసులుబాటు ఉండడంతో జనం వాటివైపు చూస్తున్నారు. ఆటం, ఓమ్, గ్రావిటన్, రివోల్ట్ వంటి కంపెనీలకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది.
స్పోర్ట్స్, స్కూటర్ మోడళ్లలో కరెంట్ బండ్లకు తయారీదారులు మరిన్ని ఫీచర్లు అద్దుతున్నారు. బ్యాటరీ లైఫ్, బ్యాకప్, చార్జింగ్ టైం, స్పీడ్ వంటి ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఫీచర్లను బట్టి ధరలను రూ.50 వేల నుంచి రూ.1.2 లక్షల దాకా పెడుతున్నారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 100 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణించేలా వాటిని డిజైన్ చేస్తున్నారు. స్పీడ్లోనూ రాజీ పడట్లేదు. గంటకు 25 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఈవీలను రూపొందిస్తున్నారు. బైకులతో పాటు ఆటోలు, కార్లు ఇప్పుడు హైదరాబాద్లోనే తయారవడం ఇంకో ప్లస్ పాయింట్. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్తో నడిచే ఆటోలను కరెంట్ వెహికల్స్గా మార్చే స్టార్టప్ కంపెనీలూ పెరుగుతున్నాయి. అచ్చంగా ఈవీలనే తయారు చేస్తున్న కంపెనీలు పదుల సంఖ్యలో ఉన్నాయి.
కార్ల ధరలెక్కువ
కార్ల సెగ్మెంట్లోనూ ఈవీలకు డిమాండ్ ఉంటోంది. ధరలే అందుబాటులో లేవు. పెద్ద కంపెనీలన్నీ కార్లను తయారు చేస్తున్నాయి. అయితే, పెట్రోల్, డీజిల్ వెర్షన్లతో పోలిస్తే ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. మామూలు కార్లతో పోలిస్తే మోడల్ను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు ఈవీలపై రేట్లు ఎక్కువున్నాయి. దానికీ కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఈవీ ఇంజన్లు తక్కువగా ఉన్నాయని రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (రెడ్కో) ప్రతినిధులు చెప్తున్నారు. కార్లే కాకుండా వీధుల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారి కోసం ఈ–రిక్షాలూ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతానికి డోర్ స్టెప్ కాన్సెప్ట్ పేరుతో విజయ పాల ఉత్పత్తుల అమ్మకాల కోసం ఈ ఆటోలను తీసుకొచ్చారు. రెండు రిఫ్రిజిరేటర్లు సహా ఈ ఆటోధర రూ.లక్షన్నర దాకా ఉంది.
పెరుగుతున్న అమ్మకాలు
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరెంట్ బండ్ల రిజిస్ట్రేషన్లు పెరిగినట్టు ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. ఇప్పటిదాకా 11 వేల దాకా ఈవీలు రిజిస్టర్ అయ్యాయంటున్నారు. ఇప్పటికీ బండ్లు, కార్ల షోరూం వద్ద వెయిటింగ్ లిస్ట్ భారీగానే ఉంటోంది. బైకుల డెలివరీకి 45 రోజులదాకా పడుతోంది. ఎక్కువ చార్జింగ్ పాయింట్లు పెట్టి, ధరలు తగ్గిస్తే ఈవీలకు ఇంకా డిమాండ్ పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తే మరిన్ని ఈవీలు అందుబాటులోకి వస్తాయని కంపెనీల ప్రతినిధులు చెప్తున్నారు.
సిటీలో పెరుగుతున్నయ్
జీహెచ్ఎంసీలో ఈవీల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వం రాయితీ ఇస్తుండడంతో ఈవీల తయారీకి సంస్థలు ముందుకొస్తున్నాయి. బైకులే కాకుండా ట్రాలీ, ప్యాసింజర్ ఆటోలు, కార్లూ అందుబాటులోకి వస్తున్నాయి. ఇంజన్లు బాగుండి.. చార్జింగ్ టైం తక్కువుండి.. ఎక్కువ దూరం ప్రయాణించగలిగితే మరింత మంది ఈవీలను కొంటారు.
- ప్రొ. కృష్ణప్రసాద్ రావు, ఈఎస్సీఐ క్వాలిటీ అండ్ మానిటరింగ్ నిపుణులు
బైకు అమ్మి ఈవీ కొన్నా
పెట్రోల్ రేటు పెరగడంతో నా పాత బండి అమ్మేసి రూ.50 వేలకు ఈవీ కొనుక్కున్నా. రూ.8 ఖర్చుతోనే 100 కిలోమీటర్లు వెళ్తున్నా. 40 కి.మీ. స్పీడ్ వెళ్తోంది. ఈవీ పాయింట్ లేక బ్యాటరీ మార్చుకోవాల్సి (స్వాపింగ్) వస్తోంది.
- జగదీశ్, విద్యానగర్, హైదరాబాద్
ఆకట్టుకుంటున్న ఆటమ్ బైక్
ఆటం ఎలక్ట్రిక్ బైక్ జనాన్ని ఆకట్టు కుంటోంది. వింటేజీ లుక్తో విశాక ఇండస్ట్రీస్ తీసుకొచ్చిన ఆటమ్1.0 ఎలక్ట్రిక్ బైక్లో ఫీచర్లూ ఆకర్షణీయంగా ఉన్నాయి. మామూలుగా బైకులకు ఉండే ఫ్యూయల్ ట్యాంకును.. ఆటమ్లో స్టోరేజ్ ట్యాంకులా వాడుకునేందుకు డిజైన్ చేశారు. బైక్లోని పోర్టబుల్ లిథియం బ్యాటరీని బయటకు తీసి చార్జ్ చేసుకోవచ్చు. ఒక్కసారి బ్యాటరీకి ఫుల్ చార్జింగ్ పెడితే 100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ధర కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండేలా రూ.50 వేలుగా నిర్ణయించారు. ఈవీలకు డిమాండ్ పెరుగుతూ ఉండటంతో దేశమంతటా ‘ఆటమ్ చార్జ్’ పేరిట ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని విశాక ఇండస్ట్రీస్ ప్రకటించింది. కాగా, ఆటమ్ బైక్కు సంబంధించి సంస్థ జాయింట్ ఎండీ గడ్డం వంశీకృష్ణకు ఇటీవలే పేటెంట్ లభించింది. 20 ఏండ్ల పాటు ఈ పేటెంట్ అమల్లో ఉంటుంది.
ఒక్కరోజులో లక్ష బుకింగ్స్
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. బుకింగ్స్ఓపెన్ అయిన ఒక్కరోజులోనే లక్ష మంది బుక్ చేసుకున్నారని ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కువ ప్రీ బుకింగ్లు అయిన బైక్గా రికార్డ్ సాధించిందన్నారు. దేశంలో ఈవీ ఇండస్ట్రీకి మంచి కిక్కిచ్చే స్టార్ట్ వచ్చిందన్నారు. ఇంత మంచి రెస్పాన్స్ చూసి థ్రిల్ అయ్యానన్నారు. జనాలు ఈవీల వైపు మొగ్గుతున్నారనేందుకు ఈ రెస్పాన్సే ఉదాహరణ అని చెప్పారు. కాగా, వచ్చే నెలలోనే ఓలా స్కూటర్లు మార్కెట్లోకి వచ్చే వీలుంది. రూ.499తో శుక్రవారం సంస్థ ప్రీ బుకింగ్లను ఓపెన్ చేసింది. అయితే, దీని ధరను మాత్రం సంస్థ ఇంకా నిర్ణయించలేదు. త్వరలోనే ప్రకటిస్తామని వెబ్సైట్లో పేర్కొంది. ఇప్పుడు బుక్ చేసుకున్నోళ్లు తర్వాత కావాలనుకుంటే ఆ బుకింగ్ను క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. పూర్తి డబ్బును రీఫండ్ చేయనున్నారు.