కరెంట్ బండ్లకు మస్తు గిరాకీ

కరెంట్ బండ్లకు మస్తు గిరాకీ
  • కరెంట్ బండ్లకు గిరాకీ
  • ఈవీల వైపు మొగ్గుతున్న జనం
  • రూ.10కే 100 కిలోమీటర్లు ప్రయాణించే వీలు
  • మూడేళ్లలో 4,800 ఈవీల అమ్మకం
  • హైబ్రిడ్​ ఈవీలతో కలిపి 11 వేల వెహికల్స్​
  • హైదరాబాద్​లోనే తయారీ ప్లాంట్లు

హైదరాబాద్​, వెలుగు: కరెంట్​ బండ్లకు (ఎలక్ట్రిక్​ వెహికల్​– ఈవీ) డిమాండ్​ పెరుగుతోంది. చాలా మంది ఈవీల వైపుకు మొగ్గుతున్నారు. ఖర్చు, మెయింటెనెన్స్​ తక్కువ ఉంటుండడంతో వాటినే కొంటున్నారు. మూడేళ్ల కిందట రాష్ట్రంలో కేవలం 16 ఈవీలే ఉండగా.. ఇప్పుడవి 4,800కు చేరాయి. జనాలు కరెంట్​ బండ్లపై ఎంత ఆసక్తి చూపిస్తున్నారో ఈ లెక్కలే చెప్తున్నాయి. వాటితో పాటు పెట్రోల్, డీజిల్​తో నడిచే హైబ్రిడ్​ ఈవీలూ బాగానే అమ్ముడవుతున్నాయి. ఇప్పటిదాకా ఈవీ, హైబ్రిడ్​ ఈవీలు కలిపి 11 వేల దాకా రిజిస్టర్​ అయ్యాయి. ఒక్కసారి చార్జ్​ చేస్తే అయ్యే ఖర్చు కేవలం 10 రూపాయలే కావడం, ఆ ఖర్చుతోనే ఎక్కువ దూరం వెళ్లే వెసులుబాటు ఉండడంతో జనం వాటివైపు చూస్తున్నారు. ఆటం, ఓమ్​, గ్రావిటన్​, రివోల్ట్ వంటి కంపెనీలకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది.  

స్పోర్ట్స్​, స్కూటర్​ మోడళ్లలో కరెంట్​ బండ్లకు తయారీదారులు మరిన్ని ఫీచర్లు అద్దుతున్నారు. బ్యాటరీ లైఫ్​, బ్యాకప్​, చార్జింగ్​ టైం, స్పీడ్​ వంటి ఫీచర్లతో మార్కెట్​లోకి తీసుకొస్తున్నారు. ఫీచర్లను బట్టి ధరలను రూ.50 వేల నుంచి రూ.1.2 లక్షల దాకా పెడుతున్నారు. ఒక్కసారి చార్జింగ్​ చేస్తే 100 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణించేలా వాటిని డిజైన్​ చేస్తున్నారు. స్పీడ్​లోనూ రాజీ పడట్లేదు. గంటకు 25 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఈవీలను రూపొందిస్తున్నారు. బైకులతో పాటు ఆటోలు, కార్లు ఇప్పుడు హైదరాబాద్​లోనే తయారవడం ఇంకో ప్లస్​ పాయింట్​. ప్రస్తుతం పెట్రోల్​, డీజిల్​తో నడిచే ఆటోలను కరెంట్​ వెహికల్స్​గా మార్చే స్టార్టప్​ కంపెనీలూ పెరుగుతున్నాయి. అచ్చంగా ఈవీలనే తయారు చేస్తున్న కంపెనీలు పదుల సంఖ్యలో ఉన్నాయి.  

కార్ల ధరలెక్కువ
కార్ల సెగ్మెంట్​లోనూ ఈవీలకు డిమాండ్​ ఉంటోంది. ధరలే అందుబాటులో లేవు. పెద్ద కంపెనీలన్నీ కార్లను తయారు చేస్తున్నాయి. అయితే, పెట్రోల్​, డీజిల్​ వెర్షన్లతో  పోలిస్తే ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. మామూలు కార్లతో పోలిస్తే మోడల్​ను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు ఈవీలపై రేట్లు ఎక్కువున్నాయి. దానికీ కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఈవీ ఇంజన్లు తక్కువగా ఉన్నాయని రెన్యువబుల్​ ఎనర్జీ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ (రెడ్కో) ప్రతినిధులు చెప్తున్నారు. కార్లే కాకుండా వీధుల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారి కోసం ఈ–రిక్షాలూ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతానికి డోర్​ స్టెప్​ కాన్సెప్ట్​ పేరుతో విజయ పాల ఉత్పత్తుల అమ్మకాల కోసం ఈ ఆటోలను తీసుకొచ్చారు. రెండు రిఫ్రిజిరేటర్లు సహా ఈ ఆటోధర రూ.లక్షన్నర దాకా ఉంది. 

పెరుగుతున్న అమ్మకాలు
ప్రస్తుతం గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో కరెంట్​ బండ్ల రిజిస్ట్రేషన్లు పెరిగినట్టు ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. ఇప్పటిదాకా 11 వేల దాకా ఈవీలు రిజిస్టర్​ అయ్యాయంటున్నారు. ఇప్పటికీ బండ్లు, కార్ల షోరూం వద్ద వెయిటింగ్​ లిస్ట్​ భారీగానే ఉంటోంది. బైకుల డెలివరీకి 45 రోజులదాకా పడుతోంది. ఎక్కువ చార్జింగ్​ పాయింట్లు పెట్టి, ధరలు తగ్గిస్తే ఈవీలకు ఇంకా డిమాండ్​ పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తే మరిన్ని ఈవీలు అందుబాటులోకి వస్తాయని కంపెనీల ప్రతినిధులు చెప్తున్నారు.  

సిటీలో పెరుగుతున్నయ్​
జీహెచ్​ఎంసీలో ఈవీల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వం రాయితీ ఇస్తుండడంతో ఈవీల తయారీకి సంస్థలు ముందుకొస్తున్నాయి. బైకులే కాకుండా ట్రాలీ, ప్యాసింజర్​ ఆటోలు, కార్లూ అందుబాటులోకి వస్తున్నాయి. ఇంజన్లు బాగుండి.. చార్జింగ్​ టైం తక్కువుండి.. ఎక్కువ దూరం ప్రయాణించగలిగితే మరింత మంది ఈవీలను కొంటారు.  
-  ప్రొ. కృష్ణప్రసాద్​ రావు, ఈఎస్​సీఐ క్వాలిటీ అండ్​ మానిటరింగ్​ నిపుణులు

బైకు అమ్మి ఈవీ కొన్నా
పెట్రోల్​ రేటు పెరగడంతో నా పాత బండి అమ్మేసి రూ.50 వేలకు ఈవీ కొనుక్కున్నా. రూ.8 ఖర్చుతోనే 100 కిలోమీటర్లు వెళ్తున్నా. 40 కి.మీ. స్పీడ్ వెళ్తోంది. ఈవీ పాయింట్​ లేక బ్యాటరీ మార్చుకోవాల్సి (స్వాపింగ్​) వస్తోంది.  
- జగదీశ్​, విద్యానగర్​, హైదరాబాద్​ 

ఆకట్టుకుంటున్న ఆటమ్​ బైక్
ఆటం ఎలక్ట్రిక్​ బైక్​ జనాన్ని ఆకట్టు కుంటోంది. వింటేజీ లుక్​తో విశాక ఇండస్ట్రీస్​ తీసుకొచ్చిన ఆటమ్​1.0 ఎలక్ట్రిక్​ బైక్​లో ఫీచర్లూ ఆకర్షణీయంగా ఉన్నాయి. మామూలుగా బైకులకు ఉండే ఫ్యూయల్​ ట్యాంకును.. ఆటమ్​లో స్టోరేజ్​ ట్యాంకులా వాడుకునేందుకు డిజైన్​ చేశారు. బైక్​లోని పోర్టబుల్​ లిథియం బ్యాటరీని బయటకు తీసి చార్జ్​ చేసుకోవచ్చు. ఒక్కసారి బ్యాటరీకి ఫుల్​ చార్జింగ్​ పెడితే 100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ధర కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండేలా రూ.50 వేలుగా నిర్ణయించారు. ఈవీలకు డిమాండ్​ పెరుగుతూ ఉండటంతో దేశమంతటా ‘ఆటమ్​ చార్జ్​’ పేరిట ఈవీ చార్జింగ్​ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని విశాక ఇండస్ట్రీస్​ ప్రకటించింది. కాగా, ఆటమ్​ బైక్​కు సంబంధించి సంస్థ జాయింట్​ ఎండీ గడ్డం వంశీకృష్ణకు ఇటీవలే పేటెంట్​ లభించింది. 20 ఏండ్ల పాటు ఈ పేటెంట్​ అమల్లో ఉంటుంది.

ఒక్కరోజులో లక్ష బుకింగ్స్
ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్లకు అదిరిపోయే రెస్పాన్స్​ వచ్చింది. బుకింగ్స్​ఓపెన్​ అయిన ఒక్కరోజులోనే లక్ష మంది బుక్​ చేసుకున్నారని ఓలా ఎలక్ట్రిక్​ సీఈవో భవీశ్​ అగర్వాల్​ తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కువ ప్రీ బుకింగ్​లు అయిన బైక్​గా రికార్డ్​ సాధించిందన్నారు. దేశంలో ఈవీ ఇండస్ట్రీకి మంచి కిక్కిచ్చే స్టార్ట్​ వచ్చిందన్నారు. ఇంత మంచి రెస్పాన్స్​ చూసి థ్రిల్​ అయ్యానన్నారు. జనాలు ఈవీల వైపు మొగ్గుతున్నారనేందుకు ఈ రెస్పాన్సే ఉదాహరణ అని చెప్పారు. కాగా, వచ్చే నెలలోనే ఓలా స్కూటర్లు మార్కెట్​లోకి వచ్చే వీలుంది. రూ.499తో శుక్రవారం సంస్థ ప్రీ బుకింగ్​లను ఓపెన్​ చేసింది. అయితే, దీని ధరను మాత్రం సంస్థ ఇంకా నిర్ణయించలేదు. త్వరలోనే ప్రకటిస్తామని వెబ్​సైట్​లో పేర్కొంది. ఇప్పుడు బుక్​ చేసుకున్నోళ్లు తర్వాత కావాలనుకుంటే ఆ బుకింగ్​ను క్యాన్సిల్​ కూడా చేసుకోవచ్చు. పూర్తి డబ్బును రీఫండ్​ చేయనున్నారు.