హాస్య కథ: వింత పక్షి.. బంగారపు రెట్ట.. వదిలేసిన మూర్ఖులు

హాస్య కథ:  వింత పక్షి.. బంగారపు రెట్ట.. వదిలేసిన మూర్ఖులు

అనగనగా ఒక అడవిలో సింధూకం  అనే ఒక పక్షి ఉండేది. అది ఓ వింత పక్షి. ఆ పక్షి వేసిన రెట్ట బంగారంగా మారేది. అదే అడవిలో తిరుగుతున్న వేటగాడికి ఈ పక్షి కంటబడింది. ఆ పక్షి రెట్ట బంగారంగా మారడాన్ని చూసిన వేటగాడు.. "ఔరా! ఇదేం వింత? పక్షి రెట్ట బంగారంగా మారడమేంటి?" అని ఆశ్చర్యపోయాడు. 

చెట్టు దగ్గరే కాపు కాసి దానికి వల వేశాడు. ఆ వింత పక్షి పాపం వలలో చిక్కుకుంది. వేటగాడు పక్షిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఆ పక్షి రోజూ రెట్ట వేసేది. అది బంగారమయ్యేది. అలా వచ్చిన బంగారాన్ని వేటగాడు జాగ్రత్తగా దాచుకునేవాడు. అయితే రోజులు గడుస్తుంటే అతనికి ఒక భయం పట్టుకుంది.'నా ఇంట్లో బంగారం ఎక్కువైతే.. ఎక్కడిదని అధికారులు అడిగితేం ఏం చెప్పాలి? కొడతారేమో!' అని భయపడ్డాడు. 

ఇక ఆలస్యం చెయ్యకుండా ఆ మరుసటి రోజే రాజుగారి దగ్గరికి వెళ్లి.. పక్షిని బహుమతిగా ఇచ్చాడు వేటగాడు. ఆ పక్షి ప్రత్యేకత ఏంటో కూడా చెప్పాడు. ఇదంతా విన్న రాజుగారు మహామంత్రిని పిలిచి వేటగాడు తెచ్చిన పక్షి గురించి వివరించాడు. మహామంత్రి నవ్వుతూ.. "మహారాజా! మీకు ఈ లోకంలో తెలియని విషయం ఏమున్నది? ఎక్కడైనా బంగారురెట్ట వేసే పక్షి ఉంటుందా? ఆ వేటగాడి మాటలు నమ్మకండి" అన్నాడు. 

►ALSO READ | Good Health: తిండి తిన్న తరువాత ఈ పనులు అసలు చేయొద్దు..

మంత్రి మాటను నమ్మిన రాజు ఆ పక్షిని వదిలేశాడు. ఆ పక్షి రెక్కలు ఆడించుకుంటూ నిలబడి.. "రాజా! తెలిసి తెలిసీ వేటగాడి వలలో చిక్కిన నేను మొదటి మూర్ఖురాలిని దొరికిన దానిని మీకు ఇచ్చేసిన వేటగాడు రెండవ మూర్ఖుడు. నా సంగతి తెలుసుకోకుండా విడిచిపెట్టమన్న మంత్రి మూడవ మూర్ఖుడు. మంత్రి మాట వినీ వినగానే నన్ను విడిచిపెట్టిన నీవు నాలుగవ మూర్ఖుడివి" అని గట్టిగా నవ్వి వెక్కిరిస్తూ ఆ వింత పక్షి తిరిగి అడవిలోకే తుర్రుమన్నది.

-–వెలుగు,  లైఫ్​‌‌–