- సీఎం రేవంత్ సమక్షంలో వంతారా టీంతో అటవీ శాఖ ఎంఓయూ
- అంతర్జాతీయ స్థాయిలో జూపార్క్, నైట్ సఫారీ ఏర్పాటుకు సహకారం
- ఈ నెలాఖరులో ‘వంతారా’ ను సందర్శించనున్న సీఎం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త జూపార్క్ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. గుజరాత్లోని జామ్నగర్ కేంద్రంగా ముఖేశ్ అంబానీ నేతృత్వంలో నడుస్తున్న ప్రపంచ ప్రఖ్యాత ‘వంతారా’ జూ తరహాలో.. మన దగ్గర కూడా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
ఇందులో భాగంగా సోమవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణ అటవీ శాఖ, వంతారా బృందం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయ స్థాయిలో జూపార్క్, నైట్ సఫారీ ఏర్పాటుకు సహకారం అందిస్తామని వంతారా టీమ్ పేర్కొంది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. జంతువుల సేవ అనే నినాదంతో వంతారా పనిచేస్తున్నదని, ఆ విధానం అభినందనీయమని కొనియాడారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోయే జూలో వంతారాలో ఉన్నటువంటి అత్యాధునిక సదుపాయాలన్నీ ఉండాలని అధికారులకు సీఎం సూచించారు.
ఇందుకోసం ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా.. జూపార్క్ డిజైన్, నిర్వహణను పరిశీలించేందుకు ఈ నెలాఖరులో సీఎం రేవంత్ గుజరాత్లోని వంతారాను సందర్శించనున్నారు. ఇక ఈఎంఓయూ ద్వారా ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కాబోయే జూపార్కుకు వంతారా టీమ్ టెక్నికల్ పార్ట్నర్గా వ్యవహరించనుంది. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ సువర్ణ, అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ సునీత భగవత్ తదితరులు పాల్గొన్నారు.
