'కాకా' వర్థంతి : కాకా అంబేడ్కర్ కాలేజీలో వర్థంతి కార్యక్రమం

'కాకా' వర్థంతి : కాకా అంబేడ్కర్ కాలేజీలో వర్థంతి కార్యక్రమం

ఇవాళ మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి 9వ వర్ధంతి. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు కాకా చిత్ర పటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వెంకటస్వామి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. 

కాక బీఆర్ అంబేడ్కర్ ఇన్స్టిట్యూట్లో వెంకటస్వామి వర్థంతి 

కాక బీఆర్ అంబేడ్కర్ ఇన్స్టిట్యూట్లో వెంకటస్వామి వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వివేక్ వెంకటస్వామి, కరస్పాండెంట్ సరోజ వివేక్, విశాక ఇండస్ట్రీస్ జేఎండీ గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. పలువురు పూర్వ విద్యార్థులు సైతం పాలు పంచుకున్నారు. ఇన్స్టిట్యూట్ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఫొటో ఎగ్జిబిషన్ను పలువురు సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రాంలో విద్యార్థులు ట్రెడిషనల్ డ్రెస్లతో అదరగొట్టారు. ఎన్సీసీ విద్యార్థుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

రాష్ట్ర సాధన కోసం ఎంతో కృషి చేశారు : పొన్నం ప్రభాకర్ 

కాకా వెంకటస్వామి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కృషి చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. కాకా వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. బడుగు, బలహీన వర్గాలు, కార్మికుల అభివృద్ధి కోసం వెంకటస్వామి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. కాకా చూపిన బాట అందరికీ ఆదర్శమని తెలిపారు. 

మంచిర్యాల జిల్లా : బెల్లంపల్లి ఏఎంసీ ప్రాంతంలో వెంకటస్వామి విగ్రహానికి స్థానిక బీజేపీ నాయకులు పూలమాలలు వేసి..నివాళులర్పించారు. కాంటా చౌరస్తాలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఏఎంసీ చౌరస్తాకు ‘కాకా చౌరస్తా’గా నామకరణం చేయాలని కాక సేవా సమితి సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కోడి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్, స్థానిక నాయకులు, కాకా సేవాసమితి సభ్యులు, కాకా అభిమానులు పాల్గొన్నారు.

గోదావరిఖని : కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో ఆ పార్టీ నాయకులు కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్మిక నేత కౌశిక హరి, నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్, అమరేందర్ రావు, కోటేశ్వరరావు, విజయ్ పాల్గొన్నారు.

పెద్దపల్లి జిల్లా : వెంకటస్వామి (కాకా) వర్ధంతి సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలో కాకా అభిమానులు, బీజేపీ శ్రేణులు ఆయన విగ్రహనికి పూలమాలలు వేసి..నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు సజ్జత్, అరెపల్లి జితేందర్, రాహుల్, అడ్డగుంట శ్రీనివాస్, సదయ్య గౌడ్, పల్లె తిరుపతి, రాకేష్, పవన్ పాల్గొన్నారు.

పెద్దపల్లి జిల్లా : మంథనిలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో వెంకటస్వామి వర్ధంతిని నిర్వహించారు. స్థానిక బీజేపీ నాయకులు.. కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఇటు జిల్లా కేంద్రంలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలో బీజేపీ నాయకులు, కాక అభిమానులు విద్యార్థులకు, నిరుపేదలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సజ్జత్, అడ్డగుంట శ్రీనివాస్, ఏగోళాపు సదయ్య గౌడ్, సోడా బాబు, ఆరేపల్లి రాహుల్, పవన్, శ్రీనివాస్, భూమయ్య, సతీష్, తిరుపతి పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లా : కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హుజురాబాద్ లో కాక వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కరీంనగర్ : చిగురుమామిడి మండల కేంద్రంలో దళిత సంఘాలు, జీవీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెంకటస్వామి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గతంలో  కాకా కేంద్రమంత్రిగా, ఎంపీగా ఉన్న సమయంలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

కరీంనగర్: కొత్తపల్లి మండలం రేకుర్తిలో దళిత సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ జువ్వాడి అంజిబాబు ఆధ్వర్యంలో దివంగత కాకా వెంకటస్వామి వర్ధంతి వేడుకలు ఘనంగా నిహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్దపల్లి జిల్లాకు కాకా వెంకటస్వామి పేరు పెట్టాలని దళిత సంఘాల జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు.