బీజేపీ, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేశాయి: గడ్డం వంశీ కృష్ణ

బీజేపీ, బీఆర్ఎస్  తెలంగాణ ప్రజలను మోసం చేశాయి: గడ్డం వంశీ కృష్ణ

మంచిర్యాల: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేశాయన్నారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ.  తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని అనుకున్నామని... కానీ, బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించారు. ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగులను బీఆర్ఎస్  మోసం చేసిందన్నారు. మే 10వ తేదీ శుక్రవారం జిల్లాలోని మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో ఉపాధి హామీ కూలీల సమస్యలు తెలుసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వంశీ కృష్ణ.

ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ.. ఉపాధి కూలీలా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.  చదువుకున్న యువత ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్తున్నారని... బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగుల తెలంగాణగా మారిందని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. ఉపాధి హామీ కూలీలకు వేతనం 400 రూపాయలకు పెంచుతుందని తెలిపారు.

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు వంద ఎకరాల్లో ఫాం హౌస్ లు కట్టుకున్నారని వంశీ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక దందా, భూ కబ్జాలు, స్కాంలు, ఉద్యోగాలు అమ్ముకున్న ఘనత బీఆర్ఎస్ నాయకులదన్నారు. కష్టపడితే ఎదైనా సాధించవచ్చనా కాక వెంకటస్వామి చెప్పేవారని తెలిపారు. కాక స్ఫూర్తితోనే సేవ చేయడానికి తాను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు.తనను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే.. పెద్దపల్లిలో ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకువస్తానని హామీ ఇచ్చారు.  ఈ నెల 13న  జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు గుద్ధితే.. నరేంద్ర మోదీ కుర్చీ కదలాలన్నారు.