- ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుపై స్టే విధించిన కోర్టు
- ఈసీకి, ప్రతివాదులకు నోటీసులు
- కౌంటరు దాఖలు చేయాలని ఆదేశం
- విచారణ నాలుగు వారాలకు వాయిదా
న్యూఢిల్లీ, వెలుగు: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదని, గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం, ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. 2018 ఎన్నికల్లో గద్వాల నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం పొందుపరిచారంటూ హైకోర్టును బీజేపీ నేత డీకే అరుణ ఆశ్రయించారు.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ గత నెల 24న తీర్పు ఇచ్చింది. అలాగే కృష్ణమోహన్రెడ్డికి రూ.2.50 లక్షల ఫైన్, పిటిషనర్ డీకే అరుణకు ఖర్చుల కింద రూ.50 వేలు చెల్లించాలని ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గత వారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
అకౌంట్స్ వివరాలు పొందుపరచకపోవడం తప్పే: కృష్ణమోహన్రెడ్డి తరఫు లాయర్
హైకోర్టులో ఎందుకు వాదనలు వినిపించలేదని కృష్ణమోహన్రెడ్డి తరఫు సీనియర్ అడ్వకేట్ సుందరాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో స్పందించిన సుందరం.. పిటిషనర్ సంతకం ఫోర్జరీ చేసి, తమకు నోటీసులు అందినట్లు హైకోర్టును మభ్య పెట్టారని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. తామెక్కడా ఎలాంటి వివరాలను దాచలేదని చెప్పారు. ఎన్నికల అఫిడవిట్లో ఫిక్స్డ్ డిపాజిట్లు అని మాత్రమే ఉందని, సేవింగ్ అకౌంట్స్ ప్రస్తావన లేదన్నారు. అయితే సేవింగ్ అకౌంట్స్ వివరాలు పొందుపరచకపోవడం తప్పేనని అంగీకరించారు.
ప్రతివాది ఆరోపించిన అకౌంట్స్కు సంబంధించి దాదాపు రూ.1.80 కోట్లు వ్యవసాయ భూమికి చెందినవని వివరించారు. ఎన్నికలకు ముందు ఆ భూమి అమ్మివేసినట్లు తెలిపారు. ఈ వాదనలను డీకే అరుణ తరఫు సీనియర్ అడ్వకేట్ జంధ్యాల రవిశంకర్ తోసిపుచ్చారు. ఎన్నికల చట్టాలకు సంబంధించి అన్ని ఖాతాల వివరాలు వెల్లడించాల్సిందేనని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైకోర్టు తీర్పు అమలులో భాగంగా డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చినట్లు బెంచ్కు తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. ఎన్నికల సంఘం, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ 4 వారాలపాటు వాయిదా వేసింది.
వెన్నుపోటు పాలిటిక్స్: బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
తనపై ప్రజా క్షేత్రంలో గెలిచే సత్తా లేక వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యే అవ్వాలని డీకే అరుణ చూస్తున్నారని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇందుకు పోర్జరీ సంతకాలను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. సోమవారం తన పిటిషన్ పై విచారణ తర్వాత సుప్రీంకోర్టు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల అఫిడవిట్ వ్యవహారంలో తనకు నోటీసులు అందలేదని, అందుకే హైకోర్టులో హాజరుకాలేదని చెప్పారు.
తర్వాత తన సంతకం ఫోర్జరీ చేసినట్లు తెలిసి.. తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా హైకోర్టు అంగీకరించలేదని చెప్పారు. 2018 ఎలక్షన్స్ ముందుగానే అమ్ముకున్న భూముల సమాచారం ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అన్ని అంశాలను సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ ముందుకు తీసుకెళ్లినట్లు వివరించారు.