- ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు తప్పని అవస్థలు
- ఆంక్షలు ఎత్తివేసి వన్ వేట్రాఫిక్ పెట్టిన పోలీసులు
- శుక్రవారం రాత్రి 10 గంటలకు ముగిసిన నిమజ్జనం
- 255 మంది పోకిరీలపై షీ టీమ్స్ కేసులు నమోదు
హైదరాబాద్,వెలుగు: హుస్సేన్సాగర్లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం ఆలస్యంగా కొనసాగింది.గురువారం ఉదయం ప్రారంభమై.. శుక్రవారం రాత్రి 10 గంటలకు ముగిసింది. మండపాల నిర్వాహ కుల నిర్లక్ష్యం, అధికారుల సమన్వయ లోపంతో ఒక్కో గణనాథుని నిమజ్జనానికి చాలా సమయం పట్టింది. ఇందుకు కారణం గురువారం జరిగిన శోభాయాత్రలో చాలా ప్రాంతాల మండపాలు పాల్గొనలేదు.
అదే రోజు రాత్రి 10 గంటలు దాటిన తర్వాత నుంచి తెల్లవారుజాము వరకు విగ్రహాలను తరలించారు. దీంతో ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఓ వైపు విగ్రహాల వాహనాలు, మరోవైపు ఆఫీసులకు ఉద్యోగులు వెళ్లే సమయాలు కావడంతో ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిలిచిపోయింది. సెంట్రల్ సిటీలోని మొజంజాహి మార్కెట్, బషీర్బాగ్, హిమాయత్నగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వాహనాలు ముందుకు కదలలేదు.
తెల్లవారుజాము నుంచే భారీ క్యూ..
ఖైరతాబాద్, బాలాపూర్ విగ్రహాల శోభాయాత్ర సమయంలో సిటీలోని ఇతర ప్రాంతాల విగ్రహాలు శోభాయాత్రలోకి రాలేదు. దీంతో గురువారం సాయంత్రం వరకు ప్రధాన శోభాయాత్ర రూట్ ఖాళీగా ఉంది. సాయంత్రం 5 గంటల తర్వాత వివిధ ప్రాంతాల నుంచి నిమజ్జనానికి తరలించారు. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటాక,శుక్రవారం ఉదయం కూడా తీసుకెళ్లారు.
దీంతో తెల్లవారుజామునుంచే హుస్సేన్సాగర్కు విగ్రహాల వాహనాలు క్యూ కట్టాయి. లైన్లో ఉన్న ఒక్కో విగ్రహం నిమజ్జనమయ్యే సరికి దాదాపు 6 గంటల సమయం పట్టింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవగా.. కంట్రోల్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ, లక్డీకపూల్ సహా అన్ని రూట్లలో వన్ వేలో వాహనాలను అనుమతించారు.
255 మంది పోకిరీల అరెస్ట్
షీ టీమ్స్, మఫ్టీ పోలీసులు పోకిరీల ఆటకట్టించారు. ఖైరతాబాద్ గణపతి మండపంతో పాటు శోభాయాత్ర, నిమజ్జనంలో నిఘా పెట్టారు. యువతులు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వారిని వీడియో క్యాప్చర్ చేసి పట్టుకున్నారు. ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్బండ్పై పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. యువతులను కావాలని టచ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించిన వారిని గుర్తించారు. సీసీ టీవీ కెమెరాల ద్వారా అందిన సమాచారంతో స్థానిక పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. చాలా మంది మద్యం మత్తులో న్యూసెన్స్ చేసినా పోలీసులు సంయమనంతో వ్యవహరించారు.
ఎక్కువ విగ్రహాలు వచ్చాయి..
ఎన్నికల సమయం కావడంతో గతేడాది కంటే ఈ సారి 15 శాతం విగ్రహాలను ఎక్కువగా ఏర్పాటు చేశారు. విగ్రహాలను నిమజ్జనానికి తరలించడంతో నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చాలామంది అర్ధరాత్రి దాటిన తర్వాత తీసుకెళ్లడంతో శుక్రవారం కూడా కొనసాగింది. మధ్యాహ్నం వరకు హుస్సేన్సాగర్లో 10,020 విగ్రహాలు నిమజ్జనం చేశారు. 5 ఫీట్లు అంతకంటే తక్కువ ఎత్తు ఉన్నవి 60 వేల వరకు ఉండగా.. ఇందులో కేవలం 9,333 మండపాలకు మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. వాహనదారులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ చేశాం.
– సీవీ ఆనంద్, సిటీ సీపీ