హైదరాబాద్ లో రెండో రోజు గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం కోసం గణనాథులు బారులు తీరారు. ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్ బండ్ పై నిమజ్జనం కోసం క్యూలో గణపతులు ఉన్నాయి. అన్ని గణపతులు నిమజ్జనం కావడానికి మధ్యాహ్నం సమయం అయ్యే అవకాశం ఉంది.
ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం తరువాత నిమజ్జన ప్రక్రియను మరింత వేగవంతం చేశారు అధికారులు. నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం 6 గంటల వరకు 7వేల 200 గణనాథుల నిమజ్జనం అయ్యాయి. ఇంకా నిమజ్జనం కోసం వందల గణనాధులు వేచి చూస్తున్నాయి. నారాయణగూడ హిమైత్ నగర్, లిబర్టీ, లకిడికపూల్ టెలిఫోన్ భవన్, బషీర్బాగ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ వినాయక విగ్రహాలతో బ్లాక్ అయ్యాయి.
మరోవైపు రాత్రి ఒంటిగంటకు చార్మినార్ లో వినాయక నిమజ్జన శోభాయాత్ర ముగిసింది. పాతబస్తీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. అర్ధరాత్రి రెండు గంటలకు నిమజ్జన ప్రక్రియను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పరిశీలించారు.