- ఆన్లైన్లో ఇంటిమేషన్ ఇస్తే చాలు
- మండపాలకు జియో ట్యాగింగ్
- ఐదు దశల్లో యాక్షన్ ప్లాన్
- విగ్రహ ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం దాకా ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: గణేశ్ మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలనే నిబంధనను పోలీసులు తొలగించారు. కేవలం సమాచారం ఇచ్చే విధంగా ఆన్లైన్ ఇంటిమేషన్ అప్లికేషన్లను అందుబాటులోకి తెచ్చారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ సూచనల మేరకు ఈ సారి కొన్ని రూల్స్ ను మార్చారు. గ్రేటర్ హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో మండపాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేకున్నా సమాచారం మాత్రం తప్పనిసరి అనే కండిషన్ పెట్టారు. డీజేలకు మాత్రం అనుమతులు లేవు.
మండపం వద్ద పూర్తి వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఇంటిమేషన్ ఫామ్స్ మంగళవారం నుంచి అందుబాటులోకి రానుంది. అందులో మండపాలను ఏర్పాటు చేయాలనుకునే వారు స్థానిక పీఎస్ పరిధిలో ఇంటిమేషన్ ఫామ్ పూర్తి చేయాలి. నిర్వాహకుల కాంటాక్ట్ నంబర్స్, మండపం ఏర్పాటు చేస్తున్న ఏరియా, కాలనీ, ఎన్నిరోజులకు నిమజ్జనం చేస్తారనే వివరాలు నింపాల్సి ఉంటుంది. పోలీసుల నుంచి ఎలాంటి సర్వీస్ కావాలో కూడా అందులో పేర్కొనాలి.
ప్రతి ఒక్కరి దగ్గర సమాచారం
ఆన్లైన్లో వచ్చిన సమాచారం మేరకు ఏ పోలీస్స్టేషన్ పరిధిలో ఎన్ని విగ్రహాలు.. ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారన్న విషయం పోలీసులకు ఈజీగా తెలిసిపోతుంది. వీటన్నింటికీ జియో ట్యాగ్ ఇస్తారు. ఈ వివరాలన్నీ స్థానిక పీఎస్ ఎస్హెచ్ఓ, బ్లూ కోల్ట్, పెట్రోలింగ్ సిబ్బందికి అందుబాటులో ఉంటాయి. దీంతో ప్రతి మండప నిర్వాహకులతో ఆయా పోలీస్ స్టేషన్ల సిబ్బంది కాంటాక్ట్లో ఉంటారు. బందోబస్తు, నిమజ్జనానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు.
పర్యావరణం కోసం మట్టి వినాయకులనే వాడండి
పర్యావరణ పరిరక్షణ, వాతావరణం, నీటి కాలుష్యం కాకుండా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్టించి పూజించాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమలను మంత్రి పంపిణీ చేశారు.
- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ప్రతి మండపంపై ఫోకస్
మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ ఇంటిమేషన్ ఫామ్ తోపాటు పీఎస్లో అప్లికేషన్స్ను అందుబాటులో ఉంచాం. నిర్వాహకులకు క్యూఆర్ కోడ్ ఇస్తాం. విగ్రహాలు పెట్టిన మూడో రోజు నుంచి ఫీల్డ్ ఆఫీసర్లు సందర్శిస్తారు. అవసరమైన బారికేడ్లు, సీసీ టీవీలు, భక్తుల క్యూ- మెయింటెనెన్స్, ట్రాఫిక్ నియంత్రణ వంటి అవసరాలను గుర్తించి ఏర్పాట్లు చేస్తాం. చివరగా నిమజ్జనం కోసం చర్యలు తీసుకుంటాం. ఈ ప్రక్రియ అంతా ఐదు దశలుగా విభజించి పూర్తి చేస్తాం. ప్రతి మండపంపై ఫోకస్ ఉంటుంది.
- సీవీ ఆనంద్, సీపీ, హైదరాబాద్