జీడిమెట్ల, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చోరీ చేస్తున్న తమిళనాడుకు చెందిన నలుగురిని మాదాపూర్సీపీఎస్, కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు తన ఆఫీసులో ప్రెస్మీట్పెట్టి వివరాలు వెల్లడించారు. తమిళనాడులోని వేళ్లూరుకు వడివేలు(27), సత్యరాజ్(20) కూలీలు. మరియప్పన్ అన్నియప్పన్(28) డ్రైవర్, సత్తివేలు(23) వంటమాస్టర్. వీరంతా సంపాదన సరిపోక, ఈజీ మనీ కోసం గ్యాంగ్గా ఏర్పడి చోరీలకు ప్లాన్ చేశారు. నలుగురు సిటీకొచ్చి పటాన్చెరు ప్రాంతంలో ఓ రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నారు.
తాము అనాథలమని ప్రచారం చేసుకుంటూ.. చెవిటి, మూగ వారిగా నటిస్తూ.. హాస్టళ్లు, హోటళ్లు, బ్యాచిలర్ల రూమ్స్ వద్దకు వెళ్లేవారు. ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్పరికరాలు గుర్తించి అదును చూసి దొంగిలించేవారు. 2019 నుంచి ఇప్పటివరకు మొత్తం 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో105 దొంగతనాలు చేశారు. విశ్వసనీయ సమాచారంతో శనివారం పటాన్చెరులోని వారి రూమ్ పై కేపీహెచ్బీ పోలీసులు దాడిచేసి, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రూ.5 లక్షలు, 3 ల్యాప్టాప్లు, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.