యువతిపై గ్యాంగ్ రేప్..బాధితురాలి చెల్లెలిపైనా లైంగిక దాడి

యువతిపై గ్యాంగ్ రేప్..బాధితురాలి చెల్లెలిపైనా లైంగిక దాడి

భోపాల్: మధ్యప్రదేశ్​లోని దాతియా జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లను నలుగురు యువకులు కిడ్నాప్  చేసి అక్కపై గ్యాంగ్ రేప్​కు పాల్పడ్డారు. ఆమె చెల్లెలి (మైనర్) పైనా లైంగిక దాడి చేశారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన అత్యాచార బాధితురాలు ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఝాన్సీలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. నలుగురు నిందితుల్లో ఒకరు బీజేపీ నేత కొడుకు అని బాధితురాలు ఆరోపించింది. ఈ దారుణం జరిగిన దాతియా జిల్లా రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రాకు హోంటౌన్.. ఆయన ఇక్కడి నుంచే అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గ్యాంగ్ రేప్, లైంగిక దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితుల బంధువులు, స్థానికులు డిమాండ్  చేశారు. పోలీస్  స్టేషన్​ను ముట్టడించి ధర్నా చేశారు. దీంతో నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తమపై ఘోరం జరిగిన తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘నలుగురు వ్యక్తులు మమ్మల్ని కిడ్నాప్ చేసి, ఒక ఇంట్లోకి తీసుకెళ్లి నా సోదరిపై అత్యాచారం చేశారు. నాపైనా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఘటన జరిగిన తర్వాత మేము ఇంటికి చేరుకున్నాం. గ్యాంగ్ రేప్​తో తీవ్రంగా మనస్తాపం చెందిన నా సోదరి ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించింది” అని అత్యాచార బాధితురాలి చెల్లెలు వెల్లడించింది. బాధితులు, నిందితులు స్టూడెంట్లేనని పోలీసులు తెలిపారు. బాధితురాలి చెల్లెలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ALSO READ :జులై 17న హైదరాబాద్‌‌లో 6,590 కిలోల డ్రగ్స్ ధ్వంసం

పార్టీపరంగా యాక్షన్  తీసుకుంటం

గ్యాంగ్ రేప్, లైంగిక దాడిపై బీజేపీ దాతియా జిల్లా చీఫ్  సురేంద్ర బుధోలియా స్పందించారు. నిందితుల్లో బీజేపీ నేత కొడుకు పాత్ర ఉన్నట్లైతే పార్టీపరంగా నిందితుడి తండ్రికి నోటీసులు పంపుతామని బుధోలియా తెలిపారు. అనంతరం పార్టీ తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.