- ముంబైలో వెయ్యి మంది కస్టమర్లు, దేశవ్యాప్తంగా లక్షకుపైనే
- మెడిసిన్ పేరిట స్పీడ్ పోస్ట్.. కొరియర్ల ద్వారా విమానాలు, రైళ్లలో రవాణా
- మ్యాంగో, స్టిక్, ఫ్లవర్ అనే కోడ్స్తో ఆర్డర్లు.. డోర్ డెలివరీ
- ఏటా రూ.5 కోట్ల దందా చేస్తున్న జార్ఖండ్ గంజాయి గ్యాంగ్
- జార్ఖండ్లో హెచ్న్యూ సెర్చ్ ఆపరేషన్.. ప్రధాన నిందితుడు సత్యం మిశ్రా అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: గంజాయి స్మగ్లర్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఈగల్ ఫోర్స్ సహా పోలీసులకు చిక్కకుండా పోస్టల్, కొరియర్ సర్విసెస్ను అడ్డాలుగా చేసుకున్నారు. మెడిసిన్ పేరిట విమానాలు, రైళ్లలో పార్సిల్స్ తరలిస్తున్నారు. మ్యాంగో, స్టిక్, ఫ్లవర్ లాంటి కోడ్తో ఆన్లైన్ ఆర్డర్ల ప్రకారం కస్టమర్ల ఇండ్లకే డైరెక్ట్గా డోర్ డెలివరీ చేస్తున్నారు.
ఇలాంటిదే జార్ఖండ్ కేంద్రంగా సాగుతున్న గంజాయి నెట్వర్క్ను హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్-న్యూ) పట్టుకుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేస్తున్న ఈ అంతర్రాష్ట్ర ముఠాలో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసింది. పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తోంది. బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్
సెంటర్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ వీసీ సజ్జనార్ ఈ గ్యాంగ్ వివరాలను వెల్లడించారు.
విమానాలు, రైళ్లలో ట్రాన్స్పోర్ట్
.
ఇండియా పోస్ట్, స్పీడ్ పోస్ట్ ద్వారా రైళ్లు, విమానాల్లో వివిధ రాష్ట్రాలకు తరలించేవారు. ఎలాంటి స్కానింగ్లో చిక్కకుండా ప్యాకింగ్ చేసేవారు. ఆర్డర్లను కస్టమర్లు ట్రాకింగ్ చేసుకునేందుకు క్యూఆర్ కోడ్, బార్ కోడ్స్ను ఏర్పాటు చేసేవారు. దీంతో పాటు ఆర్డర్ల సమయంలో కోడ్ లాంగ్వేజ్ వినియోగించేవారు. ‘మ్యాంగో, స్టిక్, ఫ్లవర్’ వంటి పదాలను కస్టమర్లకు కోడ్గా ఉపయోగించేవారు.
ఆన్లైన్ పేమెంట్స్ జరిగిన వెంటనే ఆ వివరాలను ముంబయిలోని తమ ఏజెంట్లకు పంపేవారు. దీంతో తమ వద్ద ఉన్న గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి లోకల్ ట్రైన్లు, ఆటో రిక్షాల్లో కస్టమర్లకు చేరవేసేవారు. ఇలా ఒక్క ముంబయిలోనే వెయ్యి మందికి పైగా రెగ్యులర్ కస్టమర్లకు గంజాయి సప్లయ్ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది.
ఏడాదికి రూ. 4 కోట్ల నుంచి 5 కోట్ల సంపాదన
ఈ మేరకు ఏటా సుమారు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల టర్నోవర్తో సత్యం మిశ్రా గ్యాంగ్ గంజాయి దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అంతర్రాష్ట్ర ముఠా దేశవ్యాప్తంగా రోజుకు సగటున 80 నుంచి 100 ఆర్డర్ల బుక్ చేసుకునేది. రోజుకు 8 నుంచి 10 పార్సిళ్లను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించేవారు. ప్రతి పార్సిల్లో 50 నుంచి 250 గ్రాముల వరకు గంజాయి ప్యాక్ చేసి, కస్టమర్ల ఆర్డర్ ప్రకారం రూ.1,500 నుంచి రూ. 8,000 వరకు వసూలు చేసేవారు. ఇలా రోజుకు సుమారు రూ.లక్షకు పైగా, నెలకు దాదాపు రూ. 30 లక్షల నుంచి రూ.35 లక్షలు వరకు సంపాదించేవారు.
ఇలా దొరికారు
ఇస్రీ బజార్ పోస్ట్ ఆఫీస్ ద్వారా హైదరాబాద్ గుడిమల్కాపూర్లోని కస్టమర్కి, ఫుస్రో బజార్ పోస్ట్ ఆఫీస్ నుండి ఎస్ఆర్నగర్లోని మరో కస్టమర్కి ఈ ముఠా నుంచి గంజాయి పార్సిల్ వచ్చింది. సమాచారం అందుకున్న హెచ్-న్యూ వీరిద్దరని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ కేసుల్లో గంజాయిని బుక్ చేసుకున్న హైదరాబాద్కు చెందిన సుశాంత్ వ్యాస్, లడ్డు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్పీడ్ పోస్ట్ ద్వారా పార్సిల్స్ వచ్చినట్లు గుర్తించారు. జార్ఖండ్లో 20 రోజులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. నిందితుడు సత్యం మిశ్రాను అరెస్ట్ చేశారు.
స్పీడ్ పోస్ట్, ప్రైవేట్ కొరియర్లలో డెలివరీ
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ సత్యం మిశ్రా తన అన్న శుభమ్ మిశ్రాతో కలిసి 2018 నుంచి గంజాయి దందా ప్రారంభించాడు. ఇందుకోసం తన బంధువులు సచిన్ మిశ్రా, రాహుల్ ఝా, సంతోష్ పండిట్లతో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేశాడు. వీరు తమ స్వగ్రామంలో గంజాయి పండించడంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి సేకరించేవారు.
హైదరాబాద్, ముంబై, చెన్నై, కేరళ, రాజస్తాన్, జార్ఖండ్, ఢిల్లీ, బెంగళూరు సహా దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని కస్టమర్లకు గంజాయి సప్లయ్ చేసేవారు. వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ల ద్వారా ఆర్డర్లు తీసుకుని డెలివరీ వివరాలు, పేమెంట్స్ను షేర్ చేసుకునేవారు. జార్ఖండ్లోని ఇస్రీ బజార్, ఫుస్రో బజార్ పోస్ట్ ఆఫీసుల ద్వారా పార్సిళ్లను పంపేవారు. స్పీడ్ పోస్ట్ బుకింగ్ సమయంలో పార్సిల్స్లో మెడిసిన్ ఉందంటూ నమ్మించేవారు.
