ప్రేమ వివాహంపై కక్ష.. వరుడి ఇంటికి నిప్పు.. హత్యాయత్నం

ప్రేమ వివాహంపై కక్ష.. వరుడి ఇంటికి నిప్పు.. హత్యాయత్నం
  • ఇద్దరిని అరెస్ట్​ చేసిన పోలీసులు

హసన్‌‌పర్తి, వెలుగు: ప్రేమ వివాహంపై కక్ష పెంచుకుని ఒకే కుటుంబానికి చెందిన వారిపై హత్యాయత్నానికి పాల్పడటంతో పాటు వారి ఇంటికి నిప్పంటించిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు హసన్​పర్తి సీఐ మహేందర్ తెలిపారు. సీఐ వివరాల ప్రకారం.. హసన్​పర్తి మండలం పెంబర్తి గ్రామానికి చెందిన సౌరమ్ విష్ణువర్ధన్, గుండ్ల సింగారం గ్రామానికి చెందిన కరిష్మా జూన్​ 24న ప్రేమ వివాహం చేసుకున్నారు. 

ఈ వివాహంపై ఆగ్రహంతో యువతి కుటుంబ సభ్యులు, వారి అనుచరులు మరుసటి రోజు రాత్రి విష్ణువర్ధన్ ఇంటికి వెళ్లి కత్తులతో బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం జూన్ 26 తెల్లవారుజామున 4 గంటల సమయంలో విష్ణువర్ధన్, కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా ఇంటి తలుపులు, కిటికీలపై డీజిల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో బాధితులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడగా, సుమారు రూ.లక్ష మేర ఆస్తినష్టం జరిగింది. 

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి గాదే ఇజిక్యపాల్(19), గుగులోతు మనోజ్ నాయక్(18)ను అరెస్ట్​ చేశారు. వారి వద్ద దొంగిలించిన బైక్‌‌తో పాటు తల్వార్, వ్యవసాయ కొడవలి, పెద్ద కర్ర దుడ్డు, మొబైల్ ఫోన్‌‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్‌‌కు తరలించారు.