జాగ్రెబ్: గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరుగుతున్న జాగ్రెబ్ టోర్నీలో.. ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ఉమ్మడిగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ర్యాపిడ్ సెక్షన్లో భాగంగా గురువారం జరిగిన మూడు రౌండ్లలో ప్రజ్ఞానంద నాలుగు పాయింట్లు సాధించాడు. తొలి రౌండ్లో టాప్సీడ్ విన్సెంట్ కీమర్ (జర్మనీ)పై నెగ్గిన ఇండియన్ ప్లేయర్.. మాక్సిమ్ వాచియర్ లాగ్రావ్ (ఫ్రాన్స్), డి. గుకేశ్తో జరిగిన గేమ్లను డ్రా చేసుకున్నాడు. తొలి రౌండ్లో వాచియర్ లాగ్రావ్ చేతిలో ఓడిన గుకేశ్.. రెండో రౌండ్లో ఇవాన్ సారిచ్ (క్రొయేషియా)పై నెగ్గాడు. ప్రస్తుతం గుకేశ్ మూడు పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. అలీరెజా ఫిరౌజా ఐదు పాయింట్లతో టాప్లో కొనసాగుతున్నాడు. తొమ్మిది రౌండ్ల రాపిడ్ పోటీల అనంతరం 18 రౌండ్ల బ్లిట్జ్ మెరథాన్ మ్యాచ్లు జరుగుతాయి. ఈ రెండు విభాగాల్లో సాధించిన మొత్తం పాయింట్ల ఆధారంగా విజేతను ప్రకటిస్తారు.
