
- నివాళులు అర్పించిన పౌర హక్కుల సంఘం నేతలు, ప్రజాప్రతినిధులు
జయశంకర్ భూపాలపల్లి/చిట్యాల, వెలుగు: మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామంలో శుక్రవారం ముగిశాయి. జనం భారీగా హాజరై ఎర్ర జెండాలతో, విప్లవ గీతాలు ఆలపిస్తూ ఊరేగింపుగా వెళ్లి వీడ్కోలు పలికారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య, జనశక్తి నేత అమర్, అరుణోదయ సంఘం లీడర్ విమలక్క, పలువురు విప్లవ రచయితలు, పౌర హక్కుల సంఘం, అమరుల బంధుమిత్రుల కమిటీ నాయకులు, సభ్యులు, కవులు, కళాకారులు రవికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.
రవి మృతదేహం శుక్రవారం ఉదయం 10 గంటలకు స్వగ్రామానికి చేరుకుంది. ప్రజల సందర్శనార్థం వెలిశాలలో మధ్యాహ్నం వరకు ఉంచారు. ఈలోగా రవిని చివరిచూపు కోసం వేలాదిమంది ఆయన అభిమానులు, బంధుమిత్రులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, కవులు, కళాకారులు తరలివచ్చారు. రవి స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం రవి అంతిమయాత్ర సుమారు 4 గంటల పాటు సాగింది. అంతిమయాత్ర సందర్భంగా రవి సోదరుడు గాజర్ల అశోక్ తమ కుటుంబం ఉద్యమం బాట పట్టిన తీరు, పీడిత ప్రజల కోసం వారు చేసిన త్యాగాలను వివరిస్తుంటే పలువురు కన్నీటి పర్యంతమయ్యారు.
బూటకపు ఎన్కౌంటర్లు ప్రభుత్వ హత్యలే!
ఆపరేషన్ కగార్ పేరుతో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న బూటకపు ఎన్ కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని జనశక్తి నేత అమర్, అరుణోదయ సంఘం లీడర్
విమలక్క, తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ఆరోపించారు. మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలని పిలుపునిచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా అడవులను జల్లెడ పడుతూ అమాయకులను చంపుతున్నారని మండిపడ్డారు.
పహల్గాంలో దాడి చేసిన టెర్రరిస్టులను పట్టుకోలేని మోదీ, అమిత్ షా.. 2026 మార్చి చివరికల్లా మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పడం దారుణమన్నారు. శాంతి చర్చలు జరపాలని పిలుపునిచ్చిన మావోయిస్టులను కనికరం లేకుండా కాల్చి చంపడం లో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు.