అందుకే అధ్యక్షుడిగా సంజయ్ ను ఖరారు చేశారు

అందుకే అధ్యక్షుడిగా సంజయ్ ను ఖరారు చేశారు

రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం పార్టీలో జనరేషన్ చేంజ్ కి సంకేతాలిచ్చింది. సీనియర్ నేత లక్ష్మణ్ స్థానంలో యంగ్ లీడర్ బండి సంజయ్ ని ఎంపిక చేయడం ద్వారా కొత్త నాయకత్వాన్ని ముందుకు తేవాలని జాతీయ నేతలు భావిస్తున్నట్లు స్పష్టం చేసింది. తెలంగాణలో బలపడడంపై నాయకత్వం సీరియస్ గా దృష్టిపెట్టినట్లు కొంతకాలంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పార్టీ ప్రెసిడెంట్ రేసులో బండి సంజయ్ పేరు బలంగా వినిపించింది. చివరికి ఆయన పేరునే ఖరారు చేశారు.

కరీంనగర్ లో బీసీ నేతగా ఎదిగిన సంజయ్ గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు. టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ ను సంజయ్ ఓడించడం సంచలనం రేపింది. టీఆర్ఎస్ సర్కారుపై పలు అంశాల్లో యాక్టివ్ గా పోరాటం చేస్తున్నారు సంజయ్. ఎంపీగా గెలిచిన ఏడాదిలోపే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.

స్టూడెంట్ స్థాయి నుంచే ఏబీవీపీలో ఎదిగిన బండి సంజయ్ కి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా లీడర్ గా ఎదిగారు. కొన్నేళ్లుగా సమస్యలపై చురుగ్గా జనంలోకి వెళుతున్నారు. టీఆర్ఎస్ విధానాలపై యాక్టివ్ గా పోరాడే లీడర్లలో ఆయన ముందున్నారు. సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో దళితులను పోలీసులు తీవ్రంగా వేధించిన సంఘటనను సంజయ్ నే మొదటిసారి వెలుగులోకి తెచ్చారు. బాధితులకు అండగా నిలిచి పోరాడారు. ఇలాంటి పోరాటాలతో యూత్ లో సంజయ్ కు పట్టు పెరిగింది. ఎంపీగా ఆర్టీసీ సమ్మె సమయంలో కార్మికులకు మద్దతుగా నిలిచారు. ఈ పోరాటాలతో పార్టీ నాయకత్వం దృష్టిని ఆకర్షించారు.