హైదరాబాద్, వెలుగు: డెక్కన్ కిచెన్ కూల్చివేతపై కోర్టు స్టే ఆర్డర్ ఉందని తెలియదంటే ఎలా నమ్మాలని జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్ లోకేశ్ కుమార్ను హైకోర్టు ప్రశ్నించింది. ‘సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఆదివారం కూల్చివేతలు చేపట్టకూడదని తెలియదా.. అంత అత్యవసరంగా ఎందుకు కూల్చారు’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ అధికారులు కిచెన్ను కూల్చివేశారని పేర్కొంటూ జూబ్లీహిల్స్ ఫిల్మ్నగర్లో డబ్ల్యూ3 హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ను గురువారం జస్టిస్ కన్నెగంటి లలిత విచారించారు.
స్టే ఇచ్చిన తర్వాత కూడా ఎలా కూల్చివేశారు. ఇప్పటివరకు ఆదివారం రోజున ఎన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారో చెప్పాలి’ అని కోర్టు ప్రశ్నించింది. ఇది కోర్టు ధిక్కరణే అవుతుందని పేర్కొంది. ఈ సందర్భంగా లోకేశ్ కుమార్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. కోర్టు స్టే ఉన్న విషయం తెలియదన్నారు. కేసు ఈ నెల 28కు వాయిదా పడింది.