- ధర్నా చౌక్ లో జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల నిరసన
ముషీరాబాద్, వెలుగు : ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించి తమను ఆదుకోవాలని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఇందిరాపార్కు ధర్నా చౌక్లో జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇన్ టైమ్ లో బిల్లులు రాక అప్పులపాలయ్యామని.. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ స్పందించి బకాయి ఉన్న రూ.1200 కోట్లను చెల్లించాలని కోరారు.
ఎన్నికల నిర్వహణకు టెండర్ల ద్వారా ఏర్పాట్లు చేశామని.. వాటికి సంబంధించిన డబ్బులను ఇప్పటికీ చెల్లించకపోవడం అన్యాయమని వాపోయారు. జీహెచ్ఎంసీలోని అనేక విభాగాల్లో పేమెంట్స్ బిల్లులు ఇస్తున్నప్పటికీ సివిల్ కాంట్రాక్టర్లకు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు.
బకాయిలు చెల్లించకపోతే నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. కాంట్రాక్టర్లు భాస్కరరావు, హనుమాన్సాగర్, జి. వెంకట్రావు, గంటి సాయి కిరణ్, గండికోట శ్రీనివాస్, రాజ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.