
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యల నివారణకు జీహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వచ్చే పదేండ్లలో ట్రాఫిక్ రద్దీ రెండున్నర రెట్లు పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో అదుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సిటీలో ప్రస్తుతం ఉన్న వాహనాల వివరాలు, రానున్న పదేండ్లలో ఎన్ని వెహికల్స్ పెరుగుతాయన్న అంచనాలను ఆర్టీఏ అధికారుల నుంచి జీహెచ్ఎంసీ సేకరించింది. ప్రస్తుతం హైదరాబాద్లో 68,05,432 వాహనాలు ఉండగా, 2034 నాటికి ఈ సంఖ్య కోటి 60 లక్షల 46 వేలకు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.
ఈ రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ పెరిగే ప్రాంతాలపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ట్రాఫిక్ సమస్యను అధిగమించడంపై ట్రాఫిక్ పోలీసులు, నిపుణుల నుంచి సూచనల మేరకు ప్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎస్ఆర్డీపీ ఫస్ట్ ఫేజ్ లో భాగంగా రూ.5,937 కోట్లతో 42 పనులు చేపట్టగా 7 పనులు కొనసాగుతున్నాయి. నల్గొండ చౌరస్తా నుంచి ఓవైసీ స్టీల్ బ్రిడ్జి, ఫలక్ నుమా, శాస్ర్తిపురం ఆర్వోబీ, ఆరాంఘర్– జూపార్కు బ్రిడ్జిలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఫేజ్–2 కింద రూ.4,300 కోట్లతో 36 పనుల కోసం సర్కార్కు ప్రపోజల్స్ పంపారు. పరిపాలన అనుమతులు రాగానే ఆ పనులు కూడా స్టార్ట్ కానున్నాయి.
టన్నెల్ రోడ్ల నిర్మాణంపై పరిశీలన
నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు అవసరమైతే టన్నెల్ రోడ్లు కూడా నిర్మించాలని జీహెచ్ఎంసీ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు సిటీ ట్రాఫిక్ పై సమీక్ష నిర్వహించారు. సిటీలో ట్రాఫిక్ సమస్యని ఎలా అధిగమించాలన్న దానిపై చర్చించారు. అందులో భాగంగా టన్నెల్ రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని చెప్పారు.
టన్నెల్ రోడ్ల కోసం జీహెచ్ఎంసీ ఇప్పటికే పలు మార్గాలను ఎంపిక చేసింది. అందులో ఐటీసీ కోహినూర్ నుంచి విప్రో సర్కిల్ వయా ఖాజాగూడ, నానక్రాంగూడ వరకు (9 కి.మీ.), ఐటీసీ కోహినూర్ నుంచి జేఎన్టీయూ వయా మైండ్ స్పేస్ జంక్షన్ వరకు (8 కి.మీ.), ఐటీసీ కోహినూర్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం.10 వయా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 వరకు (7 కి.మీ.), జీవీకే మాల్ నుంచి నానల్నగర్ వయా మాసబ్ట్యాంక్ వరకు (6 కి.మీ.), నాంపల్లి నుంచి చాంద్రాయణగుట్ట ఇన్నర్ రింగ్ రోడ్డు గుట్ట వయా చార్మినార్, ఫలక్నుమా వరకు (9 కి.మీ.) టన్నెల్ రోడ్లను నిర్మించేందుకు అవకాశాలున్నట్లు గుర్తించారు. వీటి నిర్మాణంలో సాధ్యాసాధ్యాలను గుర్తించేందుకు కన్సల్టెన్సీని ఎంపిక చేయాలని కూడా ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకున్నారు. టన్నెల్ రోడ్ల నిర్మాణం సాధ్యమేనని రిపోర్టు వస్తే ఆ తర్వాత రోడ్ల నిర్మాణం దిశగా ముందడుగు పడనుంది.
ఎస్ఆర్డీపీ ఫేజ్–2లో స్కైవేలు, ఫ్లైఓవర్లు...
ఎస్ఆర్డీపీ సెకండ్ ఫేజ్ పనులకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇస్తే 36 పనులు మొదలు కానున్నాయి. స్కై వేలు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు తదితర పనులు చేపట్టనున్నారు. ఇందులో ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్, కూకట్ పల్లి వై జంక్షన్, బండ్లగూడలో ఒక ఫ్లైఓవర్, ఒమర్ హోటల్ జంక్షన్, రేతిబౌలి–నానల్నగర్లో మల్టీలెవల్ అండర్ పాస్, ఫలక్ నుమా ఆర్ వోబీ, కుత్బుల్లా పూర్లో ఫాక్స్ సాగర్ పైప్లైన్పై బ్రిడ్జి, ఖాజాగూ డలో సొరంగం, మాణికేశ్వర్ నగర్ ఆర్ యూబీ, చిలుకలగూడలో ఆర్యూబీ, ఆరాంఘర్లో రెండు ఆర్ వోబీల నిర్మాణంతో పాటు ఇంకొన్ని పనులు చేయనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పనుల కోసం ప్రతిపాదనలు పంపినా అనుమతులు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మరోసారి రివైజ్ చేశారు.
ఏటా వెహికల్స్ పెరుగుదల ఇలా..
ఏడాది వాహనాల సంఖ్య
(ఆర్టీఏ అధికారుల అంచనా)
2024-25 68,05,432
2025-26 74,85,975
2026-27 82,34,573
2027-28 90,58,030
2028-29 99,63,833
2030-31 1,09,60,216
2031-32 1,32,61,862
2032-33 1,45,88,048
2033-34 1,60,46,853