- రథంపై ఊరేగిస్తూ మేళతాళాలతో చిన్నారికి ఘన స్వాగతం
- మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘటన
ముంబై: మహారాష్ట్ర బీడ్ జిల్లా పర్లీలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ వంశంలో 200 ఏండ్ల తర్వాత ఆడపిల్ల పుట్టడంతో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ ఇంటి మహాలక్ష్మీని రథంపై ఊరేగిస్తూ, మేళతాళాలతో ఇంటికి తీసుకొచ్చారు. దహిఫలే వంశంలో రెండు శతాబ్దాలుగా ఒక్క ఆడపిల్ల పుట్టలేదు. అయితే, రిషికేశ్ దహిఫలే భార్యకు ఇటీవల నెలలు నిండటంతో ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు.
ఆ చిన్నారికి గార్గి అని పేరు పెట్టారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే చిన్నారితో సహా ఆమె తల్లిని కుటుంబ సభ్యులు పూలతో అలంకరించిన ప్రత్యేక రథంపై ఘనంగా ఇంటికి తీసుకొచ్చారు. స్థానికులు కూడా ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆడపిల్ల పుట్టడంతోనే పాప తాత లింబాజీ దహిఫలే భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబంలో ఆడబిడ్డ పుట్టడం మహా అదృష్టమని, ఇన్ని సంవత్సరాలుగా తమను వేధించిన వెలితి ఇప్పుడు తీరిపోయిందని ఆయన చెప్పారు.
పాప అమ్మమ్మ సురేఖ దహిఫలే మాట్లాడుతూ.. తమ ఇంట్లోకి సాక్షాత్తు లక్ష్మీదేవి అడుగుపెట్టిందని సంతోషం వ్యక్తం చేశారు. గార్గి తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా అందరూ మగబిడ్డ కావాలని కోరుకుంటారు. కానీ, కూతురు పుట్టినప్పుడు కలిగే ఆనందం వేరు. మా బిడ్డను కంటికి రెప్పలా పెంచుకుంటాం” అని పేర్కొన్నారు.
