లక్నో : ఉత్తరప్రదేశ్లోని లక్నోలో దారుణం జరిగింది. పార్క్ చేసిన కారులో ఓ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 5న ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న బాలిక.. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ(కేజీఎంయూ)లో కొన్నిరోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నది. తరచూ ట్రీట్మెంట్ కోసం వెళ్తుండటంతో మెడికల్ కాలేజీ ముందు టీ స్టాల్ నడుపుతున్న సత్యం అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.
డిసెంబరు 5న డాక్టర్ను కలిసిన బాలిక..తన ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని సత్యం షాప్కి వెళ్లింది. కాలేజీ ముందున్న తన ఫ్రెండ్ కారులో ఛార్జింగ్ పెడదామని బాలికను సత్యం తీసుకెళ్లగా.. అస్లాం, సుహైల్ బాలిక ను బలవంతంగా కారులోకి ఎక్కించారు. ముగ్గురూ ఆమెపై అత్యాచారం చేసి పారిపోయారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోమవారం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.