అంతర్జాతీయ మార్కెట్లలో ఒక్కసారిగా పెను తుపాను చెలరేగింది. కేవలం 11 గంటల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.432 లక్షల కోట్లు ఆవిరైపోయింది. అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై తాజాగా దాడులు ప్రారంభించాయన్న వార్తలతో గ్లోబల్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఇన్వెస్టర్లు భయాందోళనలకు గురై తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడమే ఈ భారీ పతనానికి ప్రధాన కారణంగా మారింది.
సాధారణంగా ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి కూడా ఈసారి 'బ్లడ్బాత్' నుండి తప్పించుకోలేకపోయాయి. బుల్ థియరీ ఎక్స్ పోస్టు ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 7 శాతం తగ్గగా, వెండి ఏకంగా 12.3 శాతం మేర పతనమైంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడంతో కమోడిటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనై.. పెట్టుబడిదారులకు కోలుకోలేని దెబ్బతీశాయి.
ABSOLUTE BLOODBATH IN THE MARKETS.
— Bull Theory (@BullTheoryio) March 3, 2026
Over 4.7 Trillion has been Wiped out from precious metals, crypto and U.S stock market in last 11 hours.
Gold is down 7%, wiping out $2.6 trillion.
Silver is down 12.3%, wiping out $610 billion.
S&P 500 is down 1.88%, wiping out $1.14… pic.twitter.com/BPoeYBUq49
స్టాక్ మార్కెట్ల పరిస్థితి కూడా అత్యంత దారుణంగా మారింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దిక్సూచిగా భావించే అమెరికా మార్కెట్లు కుదేలయ్యాయి. S&P 500 సూచీ 1.88 శాతం నష్టపోగా, టెక్నాలజీ షేర్ల ప్రాధాన్యత కలిగిన నాస్డాక్ 2.13 శాతం పడిపోయింది. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతింటుందనే ఆందోళనలు, ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దారుణంగా దెబ్బతీశాయి.
ALSO READ : కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లను వెంటాడుతున్న భయాలు ఇవే..
మరోవైపు అత్యంత అస్థిరమైన క్రిప్టోకరెన్సీ మార్కెట్ కూడా ఈ పతనంలో భాగమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కరెన్సీ అయిన బిట్కాయిన్ విలువ 3 శాతం క్షీణించింది. ఒకవైపు యుద్ధ భయం, మరోవైపు ఆర్థిక అనిశ్చితి తోడవడంతో అటు ఈక్విటీలు, ఇటు కరెన్సీ మార్కెట్లు చిగురుటాకులా వణికిపోయాయి. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే కొన్ని దేశాల జీడీపీ కంటే ఎక్కువ సంపద తుడిచిపెట్టుకుపోవడం అంతర్జాతీయ ఆర్థిక రంగంలో పెను సంచలనంగా మారింది.
