‘దక్షిణ భారత కుంభమేళా’గా గోదావరి పుష్కరాలు.. 2027 పుష్కరాల కోసం శాశ్వత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్

‘దక్షిణ భారత కుంభమేళా’గా గోదావరి పుష్కరాలు.. 2027 పుష్కరాల కోసం శాశ్వత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్
  • బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి
  • 74 చోట్ల పుష్కర ఘాట్లు నిర్మించాలి 
  • ఒకే రోజు 2 లక్షల మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు రావొద్దు
  • కేంద్ర స్కీమ్స్​ నుంచి సహకారం తీసుకోవాలని  సూచన
  • గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, ముందస్తు సన్నద్ధతపై అధికారులతో రివ్యూ 

హైదరాబాద్​, వెలుగు : 
గోదావరి పుష్కరాలను ‘దక్షిణ భారత కుంభమేళా’గా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. 

రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. అదే క్రమంలో పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని, మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. పుష్కర స్నానాలు చేసేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేలా ప్రత్యేక ప్లాన్ ​సిద్ధం చేసుకోవాలని చెప్పారు. 


గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, ముందస్తు సన్నద్ధతపై శుక్రవారం హైదరాబాద్​ కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధికారులతో సీఎం రేవంత్​రెడ్డి సమీక్షించారు.   2027లో జులై 23వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయని, ఇప్పటి నుంచి దాదాపు 22 నెలల వ్యవధి ఉన్నందున శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే గోదావరి నదికి రాష్ట్రంలో 560 కిలోమీటర్ల  తీర ప్రాంతమున్నదని, దాదాపు 74 చోట్ల పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముంటుందని  అధికారులు వివరించారు.  బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ధర్మపురి, కాళేశ్వరంతో పాటు అన్ని ప్రధాన ఆలయాలను మొదటగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదేశించారు. ప్రధాన ఆలయాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆలయ పరిసరాల్లోని పుష్కర ఘాట్ల అభివృద్ధిని మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని చెప్పారు. 

ఆలయ అభివృద్ధితో పాటు అక్కడ శాశ్వత పుష్కర ఘాట్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.  రెండో ప్రాధాన్యంగా పుష్కర స్నానాలకు వీలుగా ఉండే గోదావరి తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పారు. ఒకే రోజు 2 లక్షల మంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా.. ఇబ్బంది లేకుండా రోడ్ల నిర్మాణంతోపాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్, తాగు నీరు, స్నానాల ఘాట్లు, భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలన్నీ ఉండేలా ప్లాన్ చేసుకోవాలన్నారు.

అనుభవం ఉన్న కన్సల్టెన్సీలను నియమించుకోవాలి

బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని ఆలయాలన్నింటినీ క్షేత్రస్థాయిలో సందర్శించి, అక్కడ అవసరమైన అభివృద్ధి పనుల జాబితాను తయారు చేయాలని అధికారులకు సీఎం రేవంత్​ సూచించారు.  ఆలయ కమిటీలు, అధికారులతో చర్చించి అక్కడ అవసరమైన ఏర్పాట్ల ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఘాట్స్‌‌‌‌‌‌‌‌ను విస్తరించడంతోపాటురోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. 

మహా కుంభమేళాతోపాటు గతంలో వివిధ రాష్ట్రాల్లో పుష్కరాలు, ఆలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల రూపకల్పనలో అనుభవమున్న కన్సల్టెన్సీలను నియమించుకోవాలని సూచించారు.  స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా ఆలయాల అభివృద్ధికి డిజైన్లు రూపొందించాలన్నారు.  


కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ ప్యాకేజీ కోరాలి

పుష్కరాల ఏర్పాట్లకు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. స్వచ్ఛ భారత్. జల్ జీవన్ మిషన్‌‌‌‌‌‌‌‌తోపాటు అందుబాటులో ఉన్న కేంద్ర పథకాలన్నింటితో సమన్వయం ఉండే పనులు గుర్తించి, వాటికి అవసరమైన అనుమతులు తీసుకోవాలని  ఆదేశించారు. దక్షిణ భారత కుంభమేళాకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ ప్యాకేజీ కోరేందుకు వీలుగా ఈ పనుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు.  

పుష్కరాల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో పర్యాటక, నీటి పారుదల, దేవాదాయ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.  ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి,  దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ధార్మిక సలహాదారు గోవిందహరి, తదితరులు పాల్గొన్నారు.