Be Alert: చాదర్​ ఘాట్​లో రెచ్చిపోతున్న దొంగలు .. ఓ ఇంట్లో 67 తులాల గోల్డ్​ చోరీ

Be Alert: చాదర్​ ఘాట్​లో  రెచ్చిపోతున్న  దొంగలు .. ఓ ఇంట్లో   67 తులాల గోల్డ్​ చోరీ

మలక్ పేట, వెలుగు: మలక్​పేట చాదర్ ఘాట్ పీఎస్​పరిధిలోని ఓ ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. 67.65 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అజంపురా మలక్​పేట రైల్వే బ్రిడ్జికి సమీపంలో ఉండే మొహమ్మద్ ఫహీముద్దీన్(56) ప్రైవేట్​ఉద్యోగి. ఇతనికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. 

ఫహీముద్దీన్ తమ్ముడు ఖాజా మొయినుద్దీన్ భార్య మరియం ఫాతిమా రెండు రోజుల కింద ఇంట్లో పడిపోవడంతో హాస్పిటల్​లో అడ్మిట్​చేశారు. ఆమెను చూసుకోవడానికి ఫహీముద్దీన్​భార్య వెళ్లింది. శుక్రవారం రాత్రి11 గంటలకు తన కూతురు, కొడుకు, తమ్ముడుతో కలిసి ఫహీముద్దీన్​భోజనం చేశాడు. తర్వాత వేర్వురు గదుల్లో అంతా నిద్రపోయారు. 

అయితే అర్ధరాత్రి తర్వాత ఒంటి గంట సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తులు వ్యక్తి ఫహీముద్దీన్​ఇంట్లోకి చొరబడ్డారు. కిచెన్ విండో ద్వారా ఇంట్లోకి దూకారు. అక్కడి హ్యాండిల్​కు తగిలించిన తాళాలతో అల్మారాను తెరిచి 67.65 తులాల బంగారు ఆభరణాలు, నగదు, మొబైల్ ఫోన్ తీసుకుని పరారయ్యారు. శనివారం ఉదయం 4 గంటలకు నిద్రలేచిన ఫహీముద్దీన్ అల్మారా తెరిచి ఉన్నట్లు గుర్తించాడు. 

బంగారం, డబ్బు కనిపించకపోవడంతో దొంగలు పడ్డారని తెలుసుకుని చాదర్​ఘాట్​పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అల్మారాలో పెట్టిన 6 7.65 తులాల గోల్డ్, మొబైల్ ఫోన్, వాచ్, వీడియో కెమెరా, కొంత నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశాడు. మలక్ పేట ఏసీపీ శ్యాంసుందర్, చాదర్ ఘాట్ ఇన్​స్పెక్టర్​బ్రహ్మ మురారి, డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ భూపాల్ గౌడ్, ఎస్సైలు తిరుపతి, భరత్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్​స్క్వాడ్, క్లూస్ టీమ్​సాయంతో తనిఖీలు నిర్వహించారు. ఐదు టీమ్స్ ను ఏర్పాటు చేసి దొంగల కోసం గాలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.