
- ఆదివాసీ సొసైటీల పొట్టగొడ్తూ కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేలా రూల్స్
- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో క్యూబిక్ మీటర్కు రూ.100 ఫిక్సేషన్
- రూ.72 నుంచి రూ.85కు టెండర్లు దక్కించుకున్న అక్కడి కాంట్రాక్టర్లు
- భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మాత్రం ఏకపక్షంగా కాంట్రాక్టర్లకు రూ.116 చొప్పున అప్పగింత
- సర్కారుకు వందల కోట్ల నష్టం
భద్రాచలం, వెలుగు:ప్రారంభమే కాని ప్రాజెక్టులో డీసిల్టేషన్ పేరిట ఇసుక తవ్వకాలకు శ్రీకారం చుట్టిన అధికారులు, ఆదివాసీ సొసైటీల పొట్ట కొట్టి, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే విధంగా రేటు ఖరారు చేయడం ఇపుడు వివాదంగా మారింది. సీతమ్మసాగర్ ప్రాజెక్టులో పూడిక తీసేందుకు భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో 20 ఇసుక ర్యాంపులను మంజూరు చేశారు.
2.44 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను రాత్రింబవళ్లు భారీ యంత్రాలతో తవ్వి ఒడ్డుపై డంప్ చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించిన అధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడంతో పాటు ఆదివాసీ సొసైటీ సభ్యులకు అన్యాయం చేశారు. కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడమే లక్ష్యంగా రేట్ ఫిక్సేషన్ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.
కాంట్రాక్టర్లకు లాభం.. ఆదివాసీలకు నష్టం..
సీతమ్మ సాగర్ పూడికతీత పేరుతో 20 చోట్ల ఇసుక తవ్వకాలకు ఎలాంటి టెండర్లు పిలవని అధికారులు, ప్రతి క్యూబిక్ మీటర్కు కాంట్రాక్టర్లకు రూ.116, గిరిజన సొసైటీలకు రూ.30 చొప్పున చెల్లించేలా రేట్లు ఖరారు చేశారు. పీసా చట్టం ప్రకారం ఏజెన్సీ ఏరియాల్లో మైన్స్ తవ్వకాలను గిరిజన సొసైటీల ద్వారానే నిర్వహించాలని, టెండర్లు పిలవరాదని ఆఫీసర్లు చెప్తున్నారు.
కానీ, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంలలో టెండర్లు పిలిచినప్పుడు కనిష్టంగా రూ.72, గరిష్టంగా రూ.85కే ఇసుక తవ్వి బయటకు తెచ్చేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. అలాంటప్పుడు ఏకపక్షంగా కాంట్రాక్టర్లకు రూ.116 , సొసైటీలకు రూ.30 మొత్తంగా రూ.146 చొప్పున ఎలా చెల్లిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదీగాక పీసా చట్టం ప్రకారం ఇసుక తవ్వకాలను కేవలం సొసైటీల ద్వారానే నిర్వహించాలి. ఆ మొత్తం కూడా వారికే చెల్లించాలి. గతంలో ఉమ్మడి ఏపీలోఖమ్మం జిల్లాలో ఆరు సొసైటీల్లో ఇసుక ర్యాంపుల నిర్వహణకు పేపరు ప్రకటన ద్వారా కాంట్రాక్టర్లను ఆహ్వానించారు.
ఆ విధానం సక్సెస్ అయ్యింది. ఆ ఆదాయం మొత్తం ఆదివాసీలకే వచ్చింది. ఇప్పుడు డీ సిల్టేషన్ విషయంలో మాత్రం ఆఫీసర్లు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని సొసైటీలకు అన్యాయం చేశారని అంటున్నారు. ఇక క్యూబిక్ మీటర్కు రూ.16 ఎక్కువగా చెల్లించడం ద్వారా 2.44 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలపై కాంట్రాక్టర్లకు రూ.39.04 కోట్ల అదనపు లాభం వస్తోంది. ఆ మేరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడగా, సొసైటీలకు రూ.10 తగ్గించడం ద్వారా రూ.24.40 కోట్లు నష్టం వస్తోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్క్ ఆర్డర్ లేకుండానే!
ఇసుక తవ్వకాలు, తోలకాల వ్యవహారంలో సీక్రెట్గా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి వర్క్ ఆర్డర్ లేకుండానే ఈ తతంగం జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో పూడికతీసే పనులు అప్పగించే సమయంలో కాంట్రాక్టర్లకు సంబంధించిన యంత్రాలు, పాన్కార్డు, జీఎస్టీ లైసెన్స్, టర్నోవర్, అనుభవం వంటి వివరాలు అడిగారు. కానీ, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని సీతమ్మసాగర్ బ్యారేజీలో డీసిల్టేషన్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు ఎలాంటి కండీషన్లు లేవు.
పేమెంట్స్, ప్రొసీజర్స్, స్పెషల్ ఆడిట్ వంటివి లేకుండా ఈ వ్యవహారం నడుస్తోంది. సొసైటీల పరిధిలో జరిగిన తవ్వకాలు, తోలకాలు, వాహనాలతో డంపింగ్ చేసే సమయంలో లాగ్ బుక్స్ నిర్వహణ సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? అనేది ఆడిట్లో తెలుస్తుంది. కానీ, ఆఫీసర్లకు ముడుపులు ఇచ్చి గుట్టుగా లెక్కలు తారుమారు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా నిబంధనల మేరకు ఇసుక తవ్వకాలు చేపట్టేలా చర్యలు తీసుకోవడంతో పాటు సొసైటీలకు తమకు అన్యాయం జరగకుండా ఆఫీసర్లు చొరవ తీసుకోవాలని ఆదివాసీ సంఘాల నాయకులు కోరుతున్నారు.
ఇంత తేడానా?
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో 5.30 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక తవ్వకాలు జరిగాయి. ఇక్కడ క్యూబిక్ మీటర్ ఇసుకను తవ్వి ఒడ్డున డంపింగ్ చేసేందుకు టీజీఎండీసీ ధర నిర్ణయించి టెండర్లు పిలిచింది. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధర రూ.100 లెస్కు కాంట్రాక్టర్లు పోటీపడి రూ.72 నుంచి రూ.85 వరకు టెండర్లు దక్కించుకున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చింది.
సీతమ్మసాగర్ బ్యారేజ్లో డీ సిల్టేషన్కు టెండర్లు నిర్వహించక పోవడం వల్ల ప్రభుత్వానికి రూ.75.64 కోట్ల ఆదాయానికి గండి పడింది. మేడిగడ్డ వద్ద కాంట్రాక్టర్లు రూ.85 గరిష్ట ధరను ప్రభుత్వానికి చెల్లించారు. సీతమ్మసాగర్ విషయంలో మాత్రం టెండర్లు లేకపోవడంతో కాంట్రాక్టర్లకు రూ.116 ధర నిర్ణయించారు. దీంతో క్యూబిక్ మీటర్పై రూ.31 చొప్పున, 2.44 కోట్ల క్యూబిక్ మీటర్లకు రూ.75.64 కోట్ల నష్టం వాటిల్లితోంది.