
భద్రాచలం, వెలుగు: జీవో నంబర్3కు బదులుగా కొత్త జీవోను తీసుకొచ్చి చట్టం చేయాలని, భద్రాచలంలో లా కాలేజీని ఏర్పాటు చేయాలనే డిమాండ్తో శనివారం భద్రాచలం ఐటీడీఏ ఎదుట గోండ్వానా సంక్షేమ పరిషత్ ధర్నా నిర్వహించింది. ఐటీడీఏ పీవో బి. రాహుల్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ.. 5వ షెడ్యూల్ ఏరియాలలో ఉన్న ఆదివాసీ నిరుద్యోగులు పదేళ్లుగా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ప్రభుత్వాలు మారినా ఆదివాసీల తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ ఎమ్మెల్యేలు దృష్టి సారించి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలం కేంద్రంగా ఆదివాసీలకు లా కాలేజీని ఏర్పాటు చేయాలని కోరారు. ధర్నాకు ఆదివాసీ ఐకాస రాష్ట్ర నాయకులు వాసం రామకృష్ణదొర, మాజీ సర్పంచ్ పడిగె ప్రశాంత్, మాజీ జడ్పీటీసీ గుండు శరత్, రాష్ట్ర కార్యదర్శి గుణసాయి తదితరులు సంఘీభావం పలికారు.