దివ్యాంగులకూ పొదుపు సంఘాలు ! ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌జీల తరహాలో పొదుపు, రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు

దివ్యాంగులకూ పొదుపు సంఘాలు ! ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌జీల తరహాలో పొదుపు, రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు
  • రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది దివ్యాంగులు 
  • 70 వేల సంఘాల బలోపేతంతో పాటు కొత్తవి ఏర్పాటుకు ప్రణాళిక
  • ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌జీల తరహాలో పొదుపు, రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు
  • సెర్ప్ ఆధ్వర్యంలో మార్గదర్శకాల రూపకల్పన

హైదరాబాద్, వెలుగు: దివ్వాంగుల ఆర్థిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో 10 లక్షల మంది దివ్యాంగులు ఉండగా.. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు స్వయం ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నది. మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌జీ) తరహాలో దివ్యాంగులకు పొదుపు సంఘాలు ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. రుణ సదుపాయంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సెర్ప్ ఆధ్వర్యంలో మార్గదర్శకాలు రూపొందిస్తున్నది. గతంలో 70 వేల సంఘాలు పనిచేసినప్పటికీ ప్రస్తుతం అవి యాక్టివ్‌‌‌‌గా లేవు. దీంతో మళ్లీ యాక్టివ్ చేసి, కొత్తవి సంఘాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. 

రాష్ట్రంలో 10.50 లక్షల మంది దివ్యాంగులు.. 
రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 10.50 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. వారిలో 7 లక్షల మందికి సదరం సర్టిఫికెట్లు ఉన్నట్లు సమాచారం. బీపీఎల్ ఉన్నవారికి పింఛన్ వస్తుంది. దాదాపు 5 లక్షల మందికి పింఛన్లు వస్తున్నట్లు తెలిసింది. గతంలో 70 వేల సంఘాలు పనిచేయగా.. 2016 తర్వాత వీటి కార్యకలాపాలు నెమ్మదించాయి. దీంతో పాత సంఘాలను బలోపేతం చేయడంతో పాటు కొత్త సంఘాలు ఏర్పాటు చేసేలా సెర్ప్ ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా పొదుపు సంఘాలకు సంబంధించి విధివిధానాల రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. ఒక్కో సంఘంలో ఎంతమంది సభ్యులు ఉండాలి? నెలవారీ పొదుపు ఎంత చేయాలి? బ్యాంకు సౌకర్యాలు లేని ప్రాంతాల్లో డబ్బు సేకరణ ఎలా జరగాలి? వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. అన్ని అంశాలు కొలిక్కి వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది. కాగా, గతంలో ఏర్పాటు చేసిన ఒక్కో సంఘంలో 6 నుంచి 7 మంది సభ్యులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మహిళా సంఘాల తరహాలో.. 
మహిళా స్వయం సహాయక సంఘాలు ప్రస్తుతం సెర్ప్ ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తున్నాయి. ఇదే తరహాలో దివ్యాంగుల సంఘాలను ఏర్పాటు చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. పొదుపు, బ్యాంకు రుణాలు, సమావేశాల నిర్వహణ వంటి అంశాలపై దృష్టిపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో 4 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 6 లక్షల మంది దివ్యాంగులు ఉన్నట్లు సమాచారం. కొత్తగా ఏర్పాటు చేయబోయే పొదుపు సంఘంలో ఐదుగురు దివ్యాంగులతో ఒక సంఘం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది.

సంఘంలో చేరేందుకు ఆధార్ కార్డు, స్థానిక చిరునామా తప్పనిసరి చేశారు. పట్టణ ప్రాంతాల్లో మెప్మా సిబ్బంది సహాయం పొందవచ్చు. సూక్ష్మ రుణాలు, పొదుపు డబ్బులతో వ్యవసాయం, వ్యవసాయేతర కార్యకలాపాలు, ఉత్పత్తి యూనిట్లు, వ్యాపారాలను ప్రారంభించవచ్చు. సాంకేతిక, వృత్తి శిక్షణ, మార్కెటింగ్ సదుపాయాలు, రాయితీ ఫైనాన్స్ వంటి సాయం అందించే అవకాశం ఉంది. తద్వారా దివ్యాంగులకు ఆర్థిక సాధికారతతో పాటు స్వాలంబన అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నది.

సదరం సర్టిఫికెట్ల జారీలో జాప్యం..
సదరం సర్టిఫికెట్లు తెలంగాణకే పరిమితం అవుతున్నాయని, ఇతర రాష్ట్రాల్లో పనిచేయడం లేదని పలువురు దివ్యాంగులు పేర్కొన్నారు. అక్కడ కూడా వర్తింపజేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. సదరం సర్టిఫికెట్‌‌‌‌ను డిజిటల్ సైన్‌‌‌‌తో జారీ చేయకపోవడంతో ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. డిజిటల్ సైన్‌‌‌‌తో ఇస్తే త్వరగా సర్టిఫికెట్ వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్వహించే సదరం క్యాంపులు యాక్టివ్‌‌‌‌గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.