
- గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
పటాన్చెరు(గుమ్మడిదల),వెలుగు : లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే.. దేశంలో రక్షణ ఉండదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి పటాన్చెరు టౌన్ లో బీజేపీ ర్యాలీ, కార్నర్మీటింగ్ నిర్వహించగా మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావుతో పాటు ఆయన పాల్గొని మాట్లాడారు. పదేండ్ల మోదీ పాలనలో బాంబు పేలుళ్లకు తావు లేకుండా చేశామని
శత్రుదేశాలు పేలుళ్లకు ఆలోచిస్తే సర్జికల్స్ట్రైక్ తో భయం పుట్టించామని పేర్కొన్నారు. రఘునందన్ రావును గెలిపించి లోక్ సభకు పంపితే మెదక్ జిల్లా గళం దేశమంతటా వినిపిస్తుందని తెలిపారు. ప్రజలు మోస పూరిత మాటలు నమ్మకుండా దేశానికి, ధర్మానికి కట్టుబడి ఉండే పార్టీకి ఓటేయాలని ఆయన కోరారు. ఈ ఎన్నికలు పదవుల కోసం కాదని, దేశ ప్రధానికి, దేశ రక్షణను నిర్దేశించే ఎన్నికలని అన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.