ఉద్యోగులు వంద శాతం హాజరు కావాలి

ఉద్యోగులు వంద శాతం హాజరు కావాలి

అమరావతి: లాక్ డౌన్ సడలింపుల క్రమంలో ఏపీలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. కంటైన్మెంటు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు మినహా.. అన్నింటా ఉద్యోగులు వంద శాతం హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయం నుంచి విభాగాధిపతులు, కలెక్టర్ కార్యాలయాలు ఇలా క్షేత్రస్థాయి వరకూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కార్యకలాపాలు ప్రారంభించాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. 21 తేదీ నుంచి వందశాతం సిబ్బందితో ప్రతీ కార్యాలయం విధులు ప్రారంభించాలని తెలిపారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటిస్తూనే విధులకు హాజరు కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మాస్కు లేకుండా ఏ ఉద్యోగీ విధులకు హాజరు కాకూడదని తెలిపింది.

ఉద్యోగులు కార్యాలయంలోనికి వచ్చే సమయంలో థర్మల్ స్కానర్లతో పరీక్ష చేయించుకోవాలని, ప్రతీ ఒక్కరికీ హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశాల్లో తెలిపారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయాన్నీ ప్రతీ రోజూ శానిటైజ్ చేయించాలని.. ప్రత్యేకించి ఎక్కువ మంది పట్టుకునే ఉపరితలాలను శానిటైజ్ చేయించాల్సిందిగా ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో కోవిడ్ నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటించేలా టేబుళ్లు కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగులు కార్యాలయ ప్రాంగణంలో పాన్, గుట్కా నమలడం, ఉమ్మి వేయడాన్ని కూడా నిషేధించినట్టు ప్రభుత్వం తెలిపింది.

భౌతికంగా పంపించే దస్త్రాలను సాధ్యమైనంత మేర తగ్గించి ఈ-ఫైల్స్ ద్వారా విధులు నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. కార్యాలయంలో సాధ్యమైనంత మేర సమావేశాలు తగ్గించి టెలీ, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా ఈ ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేసింది.  గర్భిణులు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఇంటి నుంచే పనిచేసుకునే వెసులుబాటు కల్పించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సందర్శకులను అనుమతిని నిషేధించటంతో పాటు ప్రజలకు సంబంధించిన ఫిర్యాదులను స్పందన లేదా రిసెప్షన్ కౌంటర్ల ద్వారా మాత్రమే తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.