మూడో డిస్కమ్ పేరుపై తర్జనభర్జన!..‘తెలంగాణ సెంట్రల్ డిస్కమ్’ అనే పేరు పెడతారని చర్చ 

మూడో డిస్కమ్ పేరుపై తర్జనభర్జన!..‘తెలంగాణ సెంట్రల్ డిస్కమ్’ అనే పేరు పెడతారని చర్చ 
  • పేరు ఫైనల్ అయితేనే రిజిస్ట్రేషన్.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నియామకం
  • ఆ తర్వాత ఈఆర్సీలో పేరు నమోదు 
  • ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో 3 నెలల సమయం 
  • సీఎంతో విద్యుత్​శాఖ అధికారుల భేటీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యుత్​శాఖలో కొత్తగా ఏర్పాటు చేసిన మూడో డిస్కంకు ఏ పేరు పెట్టాలనే విషయంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కరెంట్​సప్లయ్​చేసే డిస్కమ్​కు నార్త్​డిస్కం అని, దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా సరఫరా చేసే డిస్కమ్​కు సౌత్​డిస్కం అని ఇదివరకే పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన డిస్కం రాష్ట్ర మంతటా సేవలందించనుంది. దీంతో దీనికి ‘తెలంగాణ సెంట్రల్​డిస్కమ్’ అని పేరు పెడతారనే చర్చ జరుగుతున్నది. ఇదిలా ఉండగా సీఎం రేవంత్​రెడ్డి శనివారం సెక్రెటరియేట్​లో విద్యుత్​శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. 

డిస్కమ్​ పేరు ఫైనల్ అయితేనే రిజిస్ట్రేషన్

రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మూడో విద్యుత్ డిస్కమ్‌‌‌‌‌‌‌‌ పేరు ఫైనల్​ అయితేనే రిజిస్ట్రేషన్​చేయడం కుదురుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. గత రెండేండ్లుగా దక్షిణ విద్యుత్​పంపిణీ సంస్థ (ఎస్‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్) సీఎండీగా వ్యవహరించిన ముషారఫ్​ ఫారూఖీని ప్రభుత్వం మూడో డిస్కమ్ సీఎండీగా బదిలీ చేసింది. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన డిస్కమ్​రిజిస్ట్రేషన్​కు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి పెట్టారు.

భారత విద్యుత్ చట్టం–2003 కింద రాష్ట్రంలో మూడో డిస్కమ్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా రెగ్యులేటరీ 04 ఆఫ్​2016 నియమాలకు కట్టుబడి ఈ డిస్కమ్‌‌‌‌‌‌‌‌ పనిచేస్తుంది. డిస్కమ్​పేరు ఫైనల్​అయితేనే రిజిస్ట్రేషన్​చేసి, బోర్డ్ ఆఫ్ ​డైరెక్టర్లను నియమిస్తారు. ఆ తర్వాత డిస్కం పేరును టీజీ ఈఆర్​సీలో నమోదు చేస్తారు. ఉచిత విద్యుత్​కనెక్షన్లను కొత్త డిస్కమ్​పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 29.08 లక్షల విద్యుత్​కనెక్షన్లు ఈ డిస్కమ్​కు బదిలీ కానున్నాయి. వీటిని కొత్త డిస్కమ్​లోకి మార్చాలంటే ముందుగా డిస్కమ్​పేరుపై రిజిస్ట్రేషన్​చేయాల్సిన అవసరం ఉంది. 

మరో 3 నెలల సమయం

రాష్ట్ర ప్రభుత్వం కొత్త డిస్కమ్​ను ఏర్పాటు చేస్తూ గతేడాది డిసెంబర్​ 17న జీవో జారీ చేసింది. ఏప్రిల్​1 నుంచి దీని సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. గవర్నమెంట్​నుంచి డిస్కమ్​పేరు ఫైనల్​కాగానే ఆ తర్వాత ప్రకటించే బోర్డ్ ఆఫ్​డైరెక్టర్ల పేర్లతో ఈ డిస్కమ్​పరిధిలోకి వచ్చే ఆస్తులు, అప్పుల వివరాలను పేర్కొంటూ కంపెనీస్​లా చట్టం ప్రకారం డిస్కమ్​ రిజిస్ట్రేషన్​ చేయిస్తారు. ఉద్యోగుల నియామకం చేపడుతారు.

డైరెక్టర్లతో పాటు కమర్షియల్, ఆపరేషన్ అండ్​మెయింటెనెన్స్, అకౌంట్స్, ఐటీ​విభాగం, రెగ్యులేటరీ, 660 మంది ఇంజనీర్లు, 1000 మంది సిబ్బంది, 340 మంది పరిపాలనా ఉద్యోగులను నియమించాల్సి ఉన్నది. అయితే, మూడో డిస్కం విద్యుత్​కనెక్షన్లు ఉచితం కావడంతో ఇందులో పనిచేయడానికి ఇతర శాఖల నుంచి ఉద్యోగులు జంకుతున్నట్లుగా తెలిసింది. ఈ డిస్కమ్‌‌‌‌‌‌‌‌ను ప్రైవేటీకరిస్తారనే భయంతో ఆందోళనతో ఉద్యోగులు ఇందులోకి రావడానికి ఆసక్తి చూపించడం లేదు.

దీంతో కొత్త సీఎండీ ముందుగా ఉద్యోగుల సర్వీస్​రూల్స్​విషయంలో స్పష్టత తీసుకొచ్చి, వారి ఉద్యోగాలకు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం తరపున సర్క్యులర్లు, జీవోలు జారీ చేయించాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలోనే కొత్త డిస్కం ఫంక్షనింగ్​కావడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుందని విద్యుత్​శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ​పనిచేయనున్న డిస్కమ్

రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న రెండు డిస్కమ్‌‌‌‌‌‌‌‌లు కూడా నార్త్, సౌత్‌‌‌‌‌‌‌‌లుగా విడిపోయి కొన్ని జిల్లాలకే పరిమితమయ్యాయి. వరంగల్​ కేంద్రంగా ఎన్​పీడీసీఎల్, హైదరాబాద్​ కేంద్రంగా 
ఎస్​పీడీసీఎల్​ పనిచేస్తున్నది. అయితే మూడో డిస్కమ్‌‌‌‌‌‌‌‌ మాత్రం తన పరిధిని విస్తరించుకొని ఉన్నది. ఇందులో రాష్ట్రంలో వ్యవసాయ ఉచిత విద్యుత్​కనెక్షన్లు 29,05,779, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌‌‌‌‌‌‌‌(ఎల్ఐఎస్) కనెక్షన్లు 489,  హైదరాబాద్​జలమండలి 99, మిషన్ భగీరథ 1,132, మున్సిపాలిటీల పరిధిలోని ప్రత్యేక డీటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నీటి కనెక్షన్లు 639 ఉన్నాయి.

వీటన్నింటినీ మూడో డిస్కమ్‌‌‌‌‌‌‌‌కు బదిలీ చేయనున్నారు. దీంతో ఈ డిస్కమ్​కు పెట్టే పేరు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా డిస్కమ్​పనిచేయనున్న నేపథ్యంలో ‘తెలంగాణ సెంట్రల్ డిస్కమ్’ అనే పేరు పెట్టాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లుగా తెలిసింది. ఈ పేరే ఫైనల్​అవుతుందా? లేక మరేదైనా కొత్త పేరు సూచిస్తారా? అనేది సీఎం రేవంత్​ఫైనల్​ చేయనున్నారు.