
షాద్ నగర్ ,వెలుగు : రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమాలకు హద్దూ అదుపులేకుండా పోతుంది. ఇప్పటి వరకు ప్రైవేటు స్థలాలను కబ్జాచేసి వెంచర్లు చేసి విక్రయించిన భూ అక్రమార్కులు ఫరూఖ్నగర్ మండలం ఏలికట్ట గ్రామ శివారులో ఏకంగా ప్రభుత్వ భూమినే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏలికట్ట గ్రామ శివారులోని సర్వేనెంబర్ 192లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్ చేశారు. అయితే ఆ వెంచర్కు రోడ్డు మార్గం లేకపోవడంతో సర్వేనెంబర్ 209 లో 34 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంత భాగాన్ని ఆక్రమించి తమ వెంచర్లోకి రోడ్డును ఏర్పాటుచేసుకున్నారు. రోడ్డు మార్గం కోసం తీసుకున్న ప్రభుత్వ భూమిని ప్రభుత్వం పేరిటే రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. భూ అక్రమార్కుల వెంచర్పై అనుమానాలు కలిగిన కొందరు ఏలికట్ట గ్రామస్తులు ఆగస్టులో కలెక్టర్ లోకేశ్కుమార్ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అక్రమార్కుల వ్యవహారంపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఎమ్మార్వో సర్వేతో తేలిన వాస్తవాలు
ఏలికట్ట గ్రామస్తుల ఫిర్యాదును కలెక్టర్ లోకేశ్కుమార్ సీరియస్గా తీసుకున్నారు. ఈ అంశంపై క్షేత్రస్థాయిలో సర్వేచేసి నివేదికఅందజేయాలని ఎమ్మార్వో రాజేశ్వర్రెడ్డిని ఆదేశించారు. దాంతో ఎమ్మార్వో రెవెన్యూ సిబ్బందితో సర్వేచేసి ప్రభుత్వ భూమి ఆక్రమణ వాస్తవమేనని నిగ్గుతేల్చారు. రోడ్డుగా అభివృద్ధి చేసిన భూమిని వెంచర్ నిర్వాహకులు ప్రభుత్వానికే రిజిస్టర్ చేసిన సంగతిని గుర్తించి ఎమ్మార్వో నివ్వెరపోయారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిలో ఎమ్మార్వో హద్దురాళ్ళను ఏర్పాటుచేయించారు. అయితే ఎమ్మార్వో ఏర్పాటుచేయించిన హద్దురాళ్ళను భూ అక్రమార్కులు చెరిపేశారు. ఆ భూమి తమదేనంటూ గ్రామస్తులపై తమ ప్రతాపాన్ని చూపే ప్రయత్నాలు
చేశారు.
పోలీసులకు ఎమ్మార్వో ఫిర్యాదు
రెవెన్యూ సిబ్బంది సర్వేనెంబర్209లో ఏర్పాటుచేసిన హద్దురాళ్ళను వెంచర్ నిర్వహకులు తొలగించడంపై ఎమ్మార్వో రాజేశ్వర్రెడ్డి షాద్నగర్ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే రిజిస్టర్ చేసిన సబ్ రిజిస్ట్రార్పై కూడా చర్య తీసుకోవాలని ఎమ్మార్వో ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తున్నది.