రేపట్నుంచి సర్కారు ఆఫీసులు ఓపెన్

రేపట్నుంచి సర్కారు ఆఫీసులు ఓపెన్

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపులు వేగంగా అమల్లోకి వస్తున్నాయి. ప్రైవేటు రంగానికి ఇచ్చిన మినహాయింపుల మేరకు ఇప్పటికే షాపులు ఓపెన్​అయ్యాయి. ఇక గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని అన్ని గవర్నమెంట్  ఆఫీసులు సోమవారం నుంచి పూర్తి స్థాయిలో పనిచేయనున్నాయి. ఈ జోన్లలోని ఆఫీసర్లు, స్టాఫ్​ అందరూ సోమవారం నుంచి డ్యూటీకి హాజరుకావాలని ఆదేశిస్తూ సర్కారు జీవో జారీ చేసింది. పూర్తి సేవలను అందుబాటులోకి తేవాలని సూచించింది.

అన్ని డిపార్ట్​మెంట్లలో..

సీఎం ప్రకటించిన మేరకు రాష్ట్రంలో రెండో దశ లాక్​డౌన్​ఏడో తేదీ వరకు అమలైంది. 9న సెకండ్ సాటర్​ డే, 10న సండే ఉండటంతో… 11వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో డ్యూటీలకు హాజరుకావాలని సర్కారీ ఉద్యోగులకు ఆదేశాలు అందాయి.రాష్ట్రంలో అన్ని సర్కారీ డిపార్టుమెంట్లలో కలిపి 2 లక్షల 90 వేల మంది ఉద్యోగులు, 20 వేల మంది వరకు యూనివర్సిటీల సిబ్బంది ఉన్నారు. వీరికితోడు కాంట్రాక్టు, ఔట్​ సోర్సింగ్ ఎంప్లాయిస్​ కలిపి లక్ష మంది వరకు ఉన్నారు. ఇప్పటికే పోలీసు, రెవెన్యూ, హెల్త్, పంచాయతీరాజ్‌‌– రూరల్ డెవలప్​మెంట్, అగ్రికల్చర్ ​డిపార్ట్​మెంట్లు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయి. సోమవారం నుంచి మిగతా డిపార్ట్​మెంట్లు పనిచేయనున్నాయి.

రెడ్​ జోన్లలో ఇప్పుడున్నట్టే..

రెడ్ జోన్లలో ప్రస్తుతమున్న పరిస్థితే కొనసాగనుంది. రెడ్ ​జోన్లలోని గవర్నమెంట్  ఆఫీసుల్లో 33 శాతం చొప్పున సిబ్బంది రొటేషన్​లో హాజరవుతారు. డిప్యూటీ సెక్రెటరీ, ఆ పైస్థాయి అధికారులు అందరూ రోజూ ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సూర్యాపేట, వరంగల్​అర్బన్  జిల్లాలు రెడ్​జోన్​లో ఉన్నాయి. గత 14 రోజులుగా కొత్త కేసులు నమోదు కాకపోవడంతో వరంగల్​అర్బన్​ను ఆరెంజ్ జోన్​ కిందకు మార్చాలని సర్కారు కేంద్రానికి సిఫారసు చేసింది. సోమవారం నాటికి ఈ మార్పు జరిగే అవకాశం ఉంది. ఇది జరిగితే రాష్ట్రంలో 28 జిల్లాలు గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో ఉంటాయి. వాటిల్లో అన్ని ప్రభుత్వ ఆఫీసులు పనిచేస్తాయి.