హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపులు వేగంగా అమల్లోకి వస్తున్నాయి. ప్రైవేటు రంగానికి ఇచ్చిన మినహాయింపుల మేరకు ఇప్పటికే షాపులు ఓపెన్అయ్యాయి. ఇక గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని అన్ని గవర్నమెంట్ ఆఫీసులు సోమవారం నుంచి పూర్తి స్థాయిలో పనిచేయనున్నాయి. ఈ జోన్లలోని ఆఫీసర్లు, స్టాఫ్ అందరూ సోమవారం నుంచి డ్యూటీకి హాజరుకావాలని ఆదేశిస్తూ సర్కారు జీవో జారీ చేసింది. పూర్తి సేవలను అందుబాటులోకి తేవాలని సూచించింది.
అన్ని డిపార్ట్మెంట్లలో..
సీఎం ప్రకటించిన మేరకు రాష్ట్రంలో రెండో దశ లాక్డౌన్ఏడో తేదీ వరకు అమలైంది. 9న సెకండ్ సాటర్ డే, 10న సండే ఉండటంతో… 11వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో డ్యూటీలకు హాజరుకావాలని సర్కారీ ఉద్యోగులకు ఆదేశాలు అందాయి.రాష్ట్రంలో అన్ని సర్కారీ డిపార్టుమెంట్లలో కలిపి 2 లక్షల 90 వేల మంది ఉద్యోగులు, 20 వేల మంది వరకు యూనివర్సిటీల సిబ్బంది ఉన్నారు. వీరికితోడు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ కలిపి లక్ష మంది వరకు ఉన్నారు. ఇప్పటికే పోలీసు, రెవెన్యూ, హెల్త్, పంచాయతీరాజ్– రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయి. సోమవారం నుంచి మిగతా డిపార్ట్మెంట్లు పనిచేయనున్నాయి.
రెడ్ జోన్లలో ఇప్పుడున్నట్టే..
రెడ్ జోన్లలో ప్రస్తుతమున్న పరిస్థితే కొనసాగనుంది. రెడ్ జోన్లలోని గవర్నమెంట్ ఆఫీసుల్లో 33 శాతం చొప్పున సిబ్బంది రొటేషన్లో హాజరవుతారు. డిప్యూటీ సెక్రెటరీ, ఆ పైస్థాయి అధికారులు అందరూ రోజూ ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సూర్యాపేట, వరంగల్అర్బన్ జిల్లాలు రెడ్జోన్లో ఉన్నాయి. గత 14 రోజులుగా కొత్త కేసులు నమోదు కాకపోవడంతో వరంగల్అర్బన్ను ఆరెంజ్ జోన్ కిందకు మార్చాలని సర్కారు కేంద్రానికి సిఫారసు చేసింది. సోమవారం నాటికి ఈ మార్పు జరిగే అవకాశం ఉంది. ఇది జరిగితే రాష్ట్రంలో 28 జిల్లాలు గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో ఉంటాయి. వాటిల్లో అన్ని ప్రభుత్వ ఆఫీసులు పనిచేస్తాయి.